రాహుల్‌ వ్యాఖ్యల్లో విద్వేషమేముంది?

– టీపీసీసీ అధికార ప్రతినిధి కృష్ణతేజ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
‘దొంగలందరికీ మోడీ అనే ఇంటి పేరే ఎందుకు ఉంటుందో’ అంటూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యల్లో విద్వేషమేముందో బీజేపీ నేతలు చెప్పాలంటూ టీపీసీసీ అధికార ప్రతినిధి కృష్ణతేజ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. అది దేశ ద్రోహం ఎలా అవుతుందని నిలదీశారు. కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ వ్యాఖ్యలు చేస్తే, బీజేపీ కార్యకర్తల ద్వారా కేసు వేయించిందని విమర్శించారు. దేశ వ్యాప్తంగా అదానిపై వస్తున్న విమర్శల దృష్టి మళ్లించేందుకే రాహుల్‌పై కేసు నమోదు చేశారని విమర్శించారు. బీజేపీ ఎన్ని గంతులేసినా న్యాయపరంగా ఆ కేసు నిలబడబోదని ధీమా వ్యక్తం చేశారు. మోడీ పేరుతో దేశంలో పది లక్షలు మంది ఉన్నట్టు చెబుతున్నారనీ, అందులో ఎవరికైనా ఈ నష్టం జరిగిందా? లేక పిటిషన్‌కు నష్టం జరిగిందా? అందులోవిద్వేషం ఏముంది? బీజేపీ నేతలు చెప్పాలని కోరారు. ఇటువంటి కేసులతో వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నదని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 కల్పించిన పౌరస్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న మోడీ ఏ మొహం పెట్టుకుని తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారని ప్రశ్నించారు.