– ప్రచారాలకు అడ్డా కార్మికులు, వ్యవసాయ కూలీలు
– పైసలిచ్చి ప్రచారానికి తీసుకెళ్తున్న వైనం
– కూలీల కొరత తీవ్రం.. నిలిచిపోతున్న పనులు
– 30 దాకా ఇదే తంతు
– దీనిపై దృష్టి పెట్టని ఈసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఏ ఊరికెళ్లినా..ఏ రైతును పలుకరించినా కూలీల కొరత స్పష్టంగా కనబడుతున్నది. గ్రామాల్లో పత్తి ఏరడం, కలుపు తీయడం, ఇతరత్రా వ్యవసాయ పనులకు వెళ్తే రోజుకూలి రూ.300 నుంచి రూ.400 దాకా ఇస్తున్నారు. అదే రాజకీయ పార్టీల ప్రచారాలకు వెళ్తే దానికి రెట్టింపు స్థాయిలో ఇస్తున్నారు. దీంతో ప్రచార కూలీలుగా వెళ్లేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఏ ఇద్దరు కలిసినా ఈ రోజు ఏ పార్టోళ్లుపిలిచారు? ఎంత ఇస్తామన్నారు? దూరమెంత? తుఫాన్ పెట్టారా? బస్సు పెట్టారా? పైసలు ఫస్టే ఎవరిస్తున్నారు? ఇలా అన్ని అంశాలనూ బేరీజు వేసుకుని మరీ ప్రచార పర్వంలోకి దూకుతున్నారు. బీజేపీ ఇటీవల హైదరాబాద్లో ప్రధాని మోడీ సభ తెలిసిందే. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి నాలుగైదు బస్సులు పెట్టి తీసుకెళ్తారు. అదే నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి అదే కాలనీవాసులు గుంపులు గుంపులుగా వెళ్లారు. కాంగ్రెస్ ప్రచారంలోనూ వారే కనిపించారు. ఇదే విషయంపై ఈ వయస్సులో ఎందుకమ్మా అని ఓ ముసలామెను పలుకరిస్తే ‘ఊకె గూసుంటే ఏమొస్తది బిడ్డా. అట్ల రెండు గంటలు మొఖం చూపించి వస్తే రూ.500 ఇస్తున్నరు. బువ్వపెట్టిస్తున్నరు. ఎవ్వరు పిలిచినా పోతం బిడ్డా. ఓటేసేటప్పుడు మాకిష్టమునోళ్లకు వేసుకుంటం’ అని తటపటాయించకుండా చెప్పేసింది. హైదరాబాద్లోని పలు నియోజకవర్గాల్లో ఉదయం పూట ప్రచారానికి వెళ్లే టిఫిన్తో పాటు మధ్యాహ్నం భోజనం పెట్టి రూ.500 నుంచి రూ.700 దాకా ఇస్తున్నారు. అదే సాయంత్రం పూట ప్రచారానికి వెళ్తే రూ.500 ఇవ్వడంతో పాటు రాత్రి భోజనం పెట్టిస్తున్నారు. ఉదయం నాలుగు గంటలు, సాయంత్రం నాలుగు గంటలు ప్రచారానికి పోతే రూ.1000 దక్కుతుండటంతో హైదరాబాదర్ నగరంలో లేబర్ అడ్డాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అత్యవసర పనులు చేయించుకోవాలనుకునే వారు కూలీలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో అయితే మగోళ్లకు, ఆడోళ్లకు వేర్వేరుగా పైసలిస్తున్నారు. భార్యభర్తలు జంటగా మోటార్ సైకిలుపై వెళ్తే బండిలో పెట్రోలు పోయిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం పెట్టిస్తున్నారు.
దీంతో పాటు రోజువారీ కూలీగా పార్టీలను బట్టి ఒక్కొక్కరికి రూ.500 నుంచి రూ.1000 దాకా ఇస్తున్నారు. నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో ఒకే రోజు నాలుగు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసి సభలు పెట్టడంతో ప్రచార కూలీలు దొరక్క నేతలు ఇబ్బంది పడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మనిషికి రూ.500 +బండిలో పెట్రోల్+ భోజనం వంటి సౌకర్యాలను కల్పించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వారితో సమానంగా తమకూ జనం ఉన్నారని చూపించుకునేందుకు బీజేపీ నేత అయితే మనిషికి రూ.1000, బండిలో పెట్రోల్ పోయించి తీసికెళ్లినట్టు ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రంలో ఒక్క వామపక్షాలు మినహా అన్ని పార్టీలు ఎక్కువగా కూలోళ్లతోనే ప్రచారం చేయిస్తున్నారు.
తమ నేతల ప్రచారంలో వీలైనంత మేరకు ఎక్కువ మంది ఉండేలా చూసుకుంటున్నారు. ఇదంతా బహిరంగంగా జరుగుతున్న విషయమే. అయితే, పార్టీలు మాత్రం తమ అభ్యర్థుల కోసం ప్రజలంతా స్వచ్ఛందంగా తరలొస్తున్నారని గొప్పలకు పోతున్నాయి. దీనిపై ఎలక్షన్ కమిషన్ దృష్టిసారించాల్సిన అవసరముంది.