ఆంధ్రాలో పొగాకు ఉత్పత్తి పరిమాణం 170 మిలియన్‌ కిలోలకు పెంచాలి

–  ఎఫ్‌సీవీ పొగాకుఉత్పత్తులకు
– ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌
–  పంట పరిమాణాన్ని పెంచితే
రైతులకు మేలు జరుగుతుంది : కేంద్ర కార్యదర్శిని అభ్యర్థించిన వైసీపీ ఎంపీలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఆంధ్రప్రదేశ్‌లో వర్జీనియా పొగాకు ఉత్పత్తి పరిమాణాన్ని 2023-24 పంట సీజనులో 170 మిలియన్‌ కిలోలకు పెంచాలని వైసీపీ ఎంపీలు కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి రాకేశ్‌ అగర్వాల్‌ను అభ్యర్థించారు. 2023-24 పంట సీజనుకు ఆంధ్రప్రదేశ్‌లో వర్జీనియా పొగాకు ఉత్పత్తి పరిమాణం గతేడాది మాదిరిగానే 142 మిలియన్‌ కిలోలుగా ఉండాలని, 2023 జులై 17న జరిగిన సమావేశంలో పొగాకు బోర్డు తీర్మానించిందని తెలిపారు. ఈ పరిమాణాన్ని 170 మిలియన్‌ కిలోలకు పెంచాలని వైసీపీ ఎంపీలు కోరారు. ఎంపీలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, కోటగిరి శ్రీధర్‌, మార్గాని భరత్‌ కలసి వినతిని కేంద్ర సెక్రెటరీకి అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని వర్జీనియా పొగాకు ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ ఉందని, ఇప్పటికీ పొగాకు అవసరం, ఎగుమతులకు డిమాండ్‌ ఎక్కువగా ఉందని వినతిలో పేర్కొన్నారు. కనుక, ఉత్పత్తి పరిమాణాన్ని పెంచితే పొగాకు రైతులు మరింత రాబడి పొందెందుకు వీలు కలుగుతుందని, అలాగే ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుందని వివరించారు. ఈ విషయంలో చొరవ చూపి పొగాకు బోర్డుతో సంప్రదింపులు చేసి, ప్రస్తుతం నిర్ణయించిన 142 మిలియన్‌ కిలోల ఎఫ్‌సీవీ పొగాకు పరిమాణాన్ని 170 మిలియన్‌ కిలోలకు పెంచాలని కోరారు. ఈ పెంపుతో లక్షలాది మంది పొగాకు రైతులకు, ఈ రంగంలో ఉండే వారి జీవన పరిమాణాన్ని పెంచుటకు తోడ్పడుతుందని కోరారు. ఈ విషయంలో కేంద్ర కార్యదర్శి రాకేశ్‌ అగర్వాల్‌ సానుకూలంగా స్పందించినట్టు ఎంపీలు తెలిపారు.