సెప్టెంబర్‌ 1 నుంచి ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమ్మెనోటీసు అందజేసిన టీయుఎంహెచ్‌ఇయూ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జాతీయ ఆరోగ్య పథకం (నేషనల్‌ హెల్త్‌ మిషన్‌-ఎన్‌హెచ్‌ఎం)లో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ, జీతభత్యాల పెంపు కోసం సెప్టెంబర్‌ 1 నుంచి సమ్మె బాట పట్టనున్నారు. ఈ మేరకు తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీయుఎంహెచ్‌ఇయూ-సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర గౌరవాధ్యక్షులు భూపాల్‌, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ ఫసియొద్దీన్‌, కె.యాదానాయక్‌లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌, ఎన్‌హెచ్‌ఎం డైరెక్టర కు మంగళవారం సమ్మె నోటీస్‌ను అందజేశారు.
ఎన్‌హెచ్‌ఎంలో పని చేస్తున్న 17 వేల మంది ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి-సమాన వేతనం చెల్లించాలని కోరారు. 510 జీఓ అమలుకాని క్యాడర్లకు కూడా బేసిక్‌, డీఏ, హెచ్‌ఆర్‌ఏ తదితరాలను కలిపి గ్రాస్‌ శాలరీ నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. హెచ్‌ఆర్‌ పాలసీని రూపొందించాలనీ, మెడికల్‌, యాక్సిడెంటల్‌ ఇన్సూరెన్సుల సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు.
అనేక సంవత్సరాలుగా పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని వారు విమర్శించారు. ఉద్యోగుల్లో అత్యధిక మందికి పీఆర్సీ ప్రకారం జీతభత్యాలు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని కేటగిరీల వారికి పర్మినెంట్‌ ఉద్యోగి బేసిక్‌ కన్నా తక్కువ చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన దాదాపు 7 వేల మందికి కనీస బేసిక్‌ కాకుండా అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని తెలిపారు.
అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో పని చేస్తున్న పారామెడికల్‌ సిబ్బంది, అకౌంటెంట్స్‌ కమ్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్లు, పబ్లిక్‌ హెల్త్‌ మేనేజర్‌ ( మ్యూనిటీ ఆర్గనైజర్లు)లతో పాటు సపోర్టింగ్‌ సిబ్బందిలో మెడికల్‌ అసిస్టెంట్లు, వాచ్‌మెన్‌, స్వీపర్లు, బస్తీ దవాఖానాల్లో పని చేస్తున్న స్టాఫ్‌ నర్సులు, సపోర్టింగ్‌ స్టాఫ్‌కు పీఆర్సీ ప్రకారం కనీస వేతనాలు అమలు చేయకుండా తక్కువ వేతనాలిస్తున్నారని విమర్శించారు.
బ్లడ్‌ బ్యాంక్‌ డీఇఓ, ల్యాబ్‌ అటెండర్‌, ఎస్‌ఎన్‌సీ యూ సిబ్బంది, ఎంసీహెచ్‌ ఆస్పత్రుల్లోని ఓటీ అసిస్టెంట్లు, సెక్యూరిటీ గార్డులు, సపోర్టింగ్‌ స్టాఫ్‌, ఆర్‌బీఎస్కే మెడికల్‌ ఆఫీసర్లు, ఫార్మాసిస్టులు, ఏఎన్‌ఎంలు డ్రైవర్లు ఇదే విధమైన అన్యాయానికి గురవుతున్నారని తెలిపారు.
ఆయుష్‌ విభాగంలో పని చేస్తున్న ఎస్‌ఎస్‌ఓ, ఎఫ్‌ఎస్‌ఓ, డీఎసీసీ, ఎన్‌సీడీ, టీబీ, లెప్రసీ, ఎన్‌ఆర్‌సీ, టీడీ హబ్‌, పీహెచ్‌సీ కంటింజెంట్‌ తదితర విభాగాల్లో పని చేస్తున్న వారికి కూడా తక్కువ వేతనాలే అందుతున్నాయని పేర్కొన్నారు.ఆయా క్యాడర్ల ప్రకారం వైద్యారోగ్యశాఖలోని పర్మినెంట్‌ ఉద్యోగుల బేసిక్‌, అలెవెన్సులు నిర్ణయించాలని వారు డిమాండ్‌ చేశారు.