నవతెలంగాణ -హైదరాబాద్: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్పై ఆ సంస్థ ఉద్యోగులు కోర్టుకెళ్లారు. 2022 సంవత్సరానికి బోనస్ చెల్లింపులకు ట్విటర్ నిరాకరించినందుకు శాన్ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి పూర్తి బోనస్లో 50 శాతం చెల్లింపులు చేస్తామని ట్విటర్ తొలుత హామీ ఇచ్చింది. ఆ మొత్తాన్ని కూడా చెల్లించేందుకు ట్విటర్ నిరాకరించడంతో ఉద్యోగులు కోర్టుకెళ్లారు. ట్విటర్ను ఎలాన్ మస్క్ చేజిక్కించుకోక ముందే ఈ చెల్లింపులు చేయాల్సి ఉంది. మస్క్ చేతికి వచ్చాక ట్విటర్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు 75 శాతం మంది ఉద్యోగులు సంస్థను వీడారు. ఇందులో మెజారిటీ ఉద్యోగులను సంస్థ తొలగించగా.. మరికొందరు రాజీనామా చేశారు. అడ్వర్టైజ్మెంట్ ఆదాయం సైతం భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఉద్యోగులు బోనస్ గురించి ప్రస్తావించగా.. అందుకు ట్విటర్ నిరాకరించింది. దీంతో ప్రస్తుతం ట్విటర్లో పనిచేస్తున్న, 2023 తొలి త్రైమాసికంలో పనిచేసిన ఉద్యోగులంతా కోర్టుకెళ్లాలని నిర్ణయించారు. ట్విటర్ మాజీ డైరెక్టర్ మార్క్ షోబింగర్ నేతృత్వంలో ఈ దావా వేశారు. పరిహారం చెల్లింపులు, ప్రయోజనాల వంటి వ్యవహారాలు ఆయన చూసే వారు. బోనస్ చెల్లింపులకు ట్విటర్ నిరాకరించడంతో షోబింగర్ తన ఉద్యోగం నుంచి వైదొలగారు. ఒప్పందాన్ని ఉల్లంఘించారన్న కారణంతో ఉద్యోగులతో కలిసి దావా వేశారు. దీనిపై స్పందించేందుకు ట్విటర్ నిరాకరించింది.