![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/10/20231008_154952.jpg)
-ప్రభుత్వ సెలవు రోజున దర్జాగా అక్రమ రవాణా
-నంబర్ ప్లేట్, లైసెన్స్ లేకున్నా అడిగేవారు, అడ్డుకునేవారేలేరూ..
-నిద్రమత్తులో పోలీసు,రెవెన్యూ,మైనింగ్ శాఖాధికారులు
నవతెలంగాణ-బెజ్జంకి
ప్రకృతి ప్రసాదించిన సహజ సంపదను కొల్లగొట్టి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు.ఎలాంటి అనుమతులు పొందకుండా ప్రభుత్వ సెలవైన అదివారం రోజున వాగును,గుట్టలను తవ్వేస్తూ యథేచ్ఛగా ఇసుక,మట్టి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.అడిగేవారు, అడ్డుకునేవారు లేకపోవడంతో మూడు ట్రాక్టర్లు..ఆరు ట్రిప్పులుగా ఇసుక,మట్టి దందాను కొనసాగిస్తూ ఎవ్వరికి ఎదురులేని రవాణదారులుగా మండలంలో పేరు ప్రఖ్యాతలు గడిస్తున్నారు.అక్రమాలను అరికట్టే అధికారుల కళ్లెదుటే లైసెన్స్,నంబర్ ప్లేట్,అనుమతుల్లేకుండా వాహనాల్లో అక్రమ రవాణా సాగిస్తున్న..మా దందాను అడ్డుకునే దమ్ము ఎవరికుందని ఇసుకారులు,మట్టి రవాణదారులు సవాల్ విసిరేల వ్యవహరించడం అధికార యంత్రాంగ అసమర్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది.రాత్రి పగలు తేడా లేకుండా రహాణాదారులు ట్రాక్టర్లలో ఇసుకను,లారీలల్లో మట్టిని అక్రమంగా మండల కేంద్రానికి తరలిస్తున్నారు.తెల్లవారిందంటే చాలు ఇసుక,మట్టి రవాణా చేస్తున్న వాహనాలు విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. అధికారులు నిత్యం రాకపోకలు సాగించే రాజీవ్ రహదారి,మండల ప్రధాన రోడ్డులో అక్రమార్కులు దర్జాగా ఇసుక,మట్టి అక్రమ రవాణా సాగిస్తున్న పట్టించుకునే నాథులే కరువయ్యారు.
తూతూ మంత్రంగా విధుల నిర్వహణ..
ప్రభుత్వ శాఖలలో పని చేస్తున్న అధికారులు తూతూ మంత్రంగానే విధులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.పోలీసు,రె వెన్యూ,మైనింగ్,రవాణా శాఖల అధికారులు ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలున్నాయి.మండలంలోని మోయతుమ్మెద వాగు, గుండారం గ్రామ శివారులోని ప్రభుత్వ భూముల్లో నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారీతిన ఇసుక,మట్టి తవ్వకాలు చేపడుతూ రవాణ సాగిస్తున్న రెవెన్యూ, మైనింగ్ శాఖాధికారులు చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలో మైనింగ్ శాఖ అధికారులు ఉన్నట్టా..లేనట్టా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు స్థానికులు సమాచారం ఇచ్చిన రెవెన్యూ, పోలీస్ అధికారులు స్పందించడంలేదని బాహాటంగానే ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.స్థానికులు సమాచారం మేరకు కఠిన చర్యలు చేపట్టాల్సిన అధికారులు నామమాత్రంగా వ్యవహరిస్తూ కేవలం రూ.5 వేల వరకు జరిమాన విదించినట్టు విదించి డీడీ కట్టించుకొని గంటల వ్యవధిలోనే వదిలేస్తుండడం గమనార్హం.దీంతో బయటకు వచ్చిన మరుసటి గంట నుంచే అక్రమ రవాణదారులు తిరిగి ఇసుక దందాను కొనసాగించడంతో అధికారుల కనుసన్నుల్లోనే అక్రమ రవాణ దందా సాగుతోందనడానికి నిదర్శనంగా నిలుస్తోందని ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాహన చట్టం ఉల్లంఘన..
వాహన చట్ట నిబంధనల ప్రకారం ప్రతి వాహనానికి నంబరు ప్లేట్, డ్రైవర్లకు లైసెన్స్ కచ్చితంగా ఉండాల్సి ఉండగా,ఎలాంటి నంబర్ ప్లేట్లు,డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ట్రాక్టర్లలో ఇసుక అక్రమ వాహనాలను రాంగ్ రూట్లో రోడ్డెక్కిస్తూ వాహన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.రవాణా శాఖాధికారులు ఇప్పటి వరకు చర్యలు చేపట్టి కేసులు నమోదు చేసిన పరిస్థితి లేదు.ప్రకృతి ప్రసాదించిన సహజ సంపదను, ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాల్సిన పోలీసులు వాళ్ల కళ్ళ ఎదుటే జరుగుతున్న ఇసుక దోపిడీని అడ్డుకోలేకపోతున్నారు.నిత్యం పదుల సంఖ్యల ట్రాక్టర్లతో,లారీలతో యథేచ్చగా ఇసుకను,మట్టిని రవాణదారులు అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకునే పరిస్థితులు లేవంటే విధి నిర్వహణలో అధికారులు వహిస్తున్న నిర్లక్ష్యం,అలసత్వం అవినీతికి అద్దం పడుతుందనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికైనా జిల్లాధికారులు దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
నవతెలంగాణను చూసి వెనుదిరిగిన వాహనాలు
గుండారం ప్రభుత్వ భూమిలోని గుట్టును తవ్వుకుంటూ అక్రమంగా మట్టిని రవాణ చేస్తున్న ప్రాంతాన్ని నవతెలంగాణ సందర్శించేందుకు వెళ్లగా వాహనాలతో రవాణదారులు వెనుదిరిగారు.
గుండారంలో మట్టి దోపిడీని అడ్డుకోవాలి
మోయతుమ్మెద వాగులో కొనసాగుతున్న ఇసుక, గుండారం శివారులోని ప్రభుత్వ భూమిలోని గుట్ట మట్టి దోపిడీని అధికారులు అడ్డుకోవాలి.కొంతకాలంగా నిబంధనలకు విరుద్ధంగా రాత్రి పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా ఇసుక,మట్టిని రవాణదారులు దొంగిలిస్తున్నారు.ఒక్క ట్రాక్టర్పైనా అధికారులు కేసు నమోదు చేయలేదు.పోలీస్,రెవెన్యూ అధికారుల సహకారంతోనే ఇసుక మాఫియా రెచ్చిపోతున్నారు. ఇసుక,మట్టి అక్రమదారులకు సహకరిస్తున్న పోలీస్, రెవెన్యూ,మైనింగ్ అధికారులపై జిల్లాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి.
-గుండారం గ్రామస్తుడు