జాబిల్లిపై విక్రమ్‌ ల్యాండర్‌

Vikram Lander on Jabilli– ఫొటోలు పోస్ట్‌ చేసిన ఇస్రో..కాసేపటికే తొలగింపు
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుక్రవారం ఎక్స్‌లో కొన్ని ఫొటోలు పోస్ట్‌ చేసింది. బుధవారం చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన విక్రమ్‌ ల్యాండర్‌ను చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ ఫోటోలు తీసినట్లు అందులో పేర్కొంది. అయితే కొంతసేపటి తర్వాత ఆ పోస్ట్‌ను ఇస్రో తొలగించింది. చంద్రయాన్‌-3 విజయంతో చంద్రుడి దక్షిణ ద్రువంపై తొలిసారి అడుగుపెట్టిన దేశంగా భారత్‌ చరిత్ర సాధించింది.ఈ నేపథ్యంలో చంద్రుడిపై దిగిన విక్రమ్‌ ల్యాండర్‌, దాని నుంచి చంద్రుడి నేలపైకి దిగిన ప్రజ్ఞాన్‌ రోవర్‌ సమాచారం, అవి పంపే ఫొటోలు, పరిశోధనలపై సర్వత్రా ఉత్కంఠత నెలకొన్నది. ఈ నేపథ్యంలో చంద్రయాన్‌-3 మిషన్‌కు సంబంధించిన వివరాలను ఇస్రో ఎప్పటికప్పుడు ఎక్స్‌ (గతంలో ట్విట్వర్‌)లో పోస్ట్‌ చేస్తున్నది.
కాగా, చంద్రుడిపై దిగిన ల్యాండర్‌కు సంబంధించిన ఫొటోలను ఇస్రో శుక్రవారం పోస్ట్‌ చేసింది.
చంద్రయాన్‌-3 మిషన్‌కు చెందిన విక్రమ్‌ ల్యాండర్‌ను చంద్రయాన్‌ -2 ఆర్బిటర్‌ ఫోటోలు తీసినట్లు తెలిపింది. ప్రస్తుతం చంద్రుడి చుట్టూ తిరుగుతున్న చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌లో ఎవరికీ లేనటువంటి హై రిజల్యూషన్‌ కెమెరా (వోహెచ్‌ఆర్సీ) ఉన్నట్టు పేర్కొంది. కొన్ని క్షణాల తర్వాత ఆ పోస్ట్‌ను ఎక్స్‌ నుంచి తొలగించింది. అయితే ఇస్రో ఇలా ఎందుకు చేసిందో అంతుపట్టడం లేదు. మరోవైపు చంద్రయాన్‌-2 తీసిన విక్రమ్‌ ల్యాండర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.