– రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ నిరంతరం అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం హైదరాబాద్లో జరిగిన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరం మౌలిక సదుపాయాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని గుర్తు చేశారు. ఎప్పటికప్పుడు మారుతున్న శాస్త్ర, సాంకేతిక రంగాలను అందిపుచ్చుకుని న్యూయార్క్ లాంటి నగరాలతో పోటీ పడుతూ ప్రపంచ పటంలో తనకంటూ గుర్తింపు పొందిందని అన్నారు. ఒక వైపు అభివృద్ధిని, మరో వైపు సంక్షేమాన్ని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నామని పేర్కొన్నారు. విద్యత్ సమస్యను పరిష్కరించామని, శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయని కితాబునిచ్చారు. హైదరాబాద్ ఎంతో అభివద్ధి చెందిందని నటుడు రజినీకాంత్ లాంటి ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారని గుర్తు చేశారు .కొత్తగా 36 ఫ్లైఓవర్లు నిర్మించడంతో పాటు 39 చెరువులు సుందరీకరించామన్న కేటీఆర్, మిషన్భగీరథతో హైదరాబాద్లో తాగునీటి సమస్య లేకుండా చేశామని తెలిపారు. ఐటీ ఉద్యోగులు బీఆర్ఎస్ పాలనల్షో 10 లక్షలకు పెరిగారన్నారు. హైదరాబాద్ నగర ప్రజలు గత ప్రభుత్వాల పనితీరు నగర అభివద్ధితో పోల్చుకొని భారత రాష్ట్ర సమితి ప్రభుత్వానికి పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.