![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/IMG-20230710-WA0474-300x180.jpg)
-నిర్విరామంగా ఎత్తిపోత ప్రక్రియ… ఆనందంలో రైతులు
నవతెలంగాణ – సిద్దిపేట
రంగనాయక సాగరంలో గోదావరి జల సవ్వడులు మొదలయ్యాయి. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ పంప్ హౌస్ లోని మోటారును రైతుల కోరిక, సీఏం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ అధికార యంత్రాంగం మోటార్లను ఆన్ చేసి నీటి ఎత్తిపోత చేపట్టగా ప్రస్తుతం 3టీఏంసీలతో నిండు కుండలా రంగనాయక సాగరం మారింది.
యాసంగి ముందు కూడా రంగనాయక సాగరులో 3 టీఏంసీలు నీళ్లు ఉండటం ఫలితంగా బరువైన పంట పండిన సంగతి తెలిసిందే. ఈ దరిమిలా వర్షాకాలం సీజన్ మొదలై వానలు కురవకపోయినా సాగుకు ఇబ్బంది తలెత్తకుండా వానాకాలం పంటకు గోదావరి నీళ్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. రిజర్వాయరులో నీళ్లు నింపుతుండటంతో ఈ ప్రాంత రైతులలో సంతోషం వ్యక్తమవుతున్నది. ఇక పంట సాగు చేసుకోవడానికి ఢోకా లేదని రైతులు మురిసి పోతున్నారు. నీటిని ఎత్తిపోయడంతో మరోవైపు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఆదివారం నాటికి రంగనాయక సాగరంలో 3 టీఏంసీల నీరు వచ్చి చేరి నిండు కుండలా మారింది.
ఇటీవల దశాబ్ది ఉత్సవాలు సైతం రంగనాయక సాగరంలో చేసిన సంగతి విదితమే. కానీ ఇప్పుడు మోటార్లు ఆన్ చేసి రంగనాయక సాగర్ నింపుకోవడం ద్వారా బీడు భూములైన సిద్ధిపేట, సిరిసిల్లాకు గోదావరి జలాలు పరవళ్ళు తొక్కాయి. రంగనాయక సాగరం ఆయకట్టు కింద మేజర్, మైనర్ కాల్వలు, కుడి కాలువ ద్వారా చేర్యాల, మద్దూరు, నంగునూరు, సిద్ధిపేట అర్బన్, ఎడమ కాలువ ద్వారా చిన్నకోడూర్, నారాయణరావుపేట, సిద్ధిపేట రూరల్, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఇల్లంతకుంట, ముస్తాబాద్, తంగళ్లపల్లి మండలంలోని గ్రామాలకు సాగునీరు అందనున్నది. దీంతో ఆయా జిల్లాల పరిధిలోని సిరిసిల్లా, ముస్తాబాద్, హుస్నాబాద్ పరిధిలోని శనిగరం చెరువు, సిద్ధిపేట నియోజక వర్గ పరిధి కలుపుకుని లక్షా పది వేల ఏకరాలకు సాగునీరు అందనున్నది.
– రంగనాయక సాగర్ ను పరిశీలించిన మంత్రి…
కాంగ్రెస్, బీజేపే నాయకులూ కాళేశ్వరం నీళ్లను చుడండి. ఇక్కడికి వచ్చి చూస్తే ఎన్ని నీళ్లు ఉన్నాయో తెలుస్తుంది. మోటార్ల నుంచి ఉబికి వస్తున్న గోదావరి జలాలు చూసి సంబురపడ్డ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్య. ఈ ప్రాంత రైతులు ఓ వైపు విత్తనాలు వేస్తూ నార్లు పోసుకుంటున్నారు. వానలు లేకపోవడంతో రాత్రింబవళ్ళు కాళేశ్వరం మోటార్ల ద్వారా నీళ్లు వచ్చి చేరినయ్. కాళేశ్వరం పూర్తయి నీళ్లు వస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు కన్నీళ్లు వస్తున్నాయని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రతిపక్షాలపై తనదైన శైలిలో స్పందించారు.