ఏ రేంజ్‌ అనేది ప్రేక్షకులు డిసైడ్‌ చేస్తారు..

ఏ రేంజ్‌ అనేది ప్రేక్షకులు డిసైడ్‌ చేస్తారు..రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైల్డ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘యానిమల్‌’. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌కు జోడిగా రష్మిక మందన్న కథానాయికగా నటించింది. అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్‌ కుమార్‌, క్రిషన్‌ కుమార్‌ టి-సిరీస్‌, ప్రణరు రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. ఈ చిత్రం డిసెంబర్‌ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రెస్‌మీట్‌ నిర్వహించింది.
రణ్‌బీర్‌ కపూర్‌ మాట్లాడుతూ,’తెలుగు చిత్ర పరిశ్రమ నాకు ఎంతో ప్రత్యేకం. ఇక్కడ ప్రేక్షకులు సినిమాల పట్ల చూపించే ప్రేమ, ఆదరణ అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రంలో చాలా విలక్షణమైన పాత్ర చేశాను. నా పాత్ర చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. తన తండ్రి పట్ల విపరీతమైన ప్రేమ ఉన్న కొడుకు పాత్రలో కనిపిస్తాను. అలాగే ఈ చిత్రంలో నా భార్య గీతాంజలి పాత్రతో కూడా చాలా ఘాడమైన ప్రేమలో ఉంటాను. యానిమల్స్‌ అన్‌ ప్రెడిక్ట్బుల్‌గా ఉంటాయి. ఇందులో నా పాత్ర ఆ స్వభావంతో ఉంటుంది. యానిమల్‌ కథ, పాత్రలు అందరికీ కనెక్ట్‌ అవుతాయి’ అని తెలిపారు. ‘నా మొదటి చిత్రం ‘వంశవక్షం’ ది గ్రేట్‌ బాపు దర్శకత్వంలో చేశాను. నా ఫౌండేషన్‌ సౌత్‌ పరిశ్రమలోనే పడింది. ఇప్పుడు నా రెండో తెలుగు సినిమాగా ఈ సినిమా విడుదల కావడం ఆనందంగా ఉంది. సందీప్‌ ఈ కథ చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నాను. ఈ కథని ఆయన అద్భుతంగా రాసుకున్నాడు. అందరూ ఇందులో ఎమోషన్స్‌కు కనెక్ట్‌ అవుతారు’ అని అనిల్‌ కపూర్‌ అన్నారు.
రష్మిక మాట్లాడుతూ,’ఇది నాకు చాలా స్పెషల్‌ మూవీ. సందీప్‌ ఈ కథను, పాత్రలను అద్భుతంగా మలిచారు. ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.
దర్శకుడు సందీప్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘తండ్రి కోసం కొడుకు ఎంత దూరం వెళ్ళగలడు అనేది ఈ కథ ప్రధాన సారాంశం. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. సినిమా హిట్‌ అవుతుంది. అయితే అది ఏ స్థాయిలో అనేది ఆడియన్స్‌ డిసైడ్‌ చేస్తారు. ఖచ్చితంగా సినిమా బాక్సాఫీస్‌ వద్ద వండర్స్‌ క్రియేట్‌ చేస్తుంది’ అని చెప్పారు.