నవతెలంగాణ – ఇంఫాల్: మణిపూర్లో హింసాత్మక సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 15 ఇండ్లు దగ్ధం కాగా, కాల్పుల్లో కొందరు గాయపడ్డారు. పశ్చిమ ఇంఫాల్ జిల్లాలోని లాంగోల్ గేమ్స్ గ్రామంలో అల్లరి మూక రెచ్చిపోయింది. 15 ఇండ్లకు నిప్పుపెట్టింది. దీంతో అల్లరి మూకను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 45 ఏళ్ల వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో హింసాత్మక సంఘటనలు జరిగాయి. పలు వాణిజ్య సముదాయాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. మిలిటెంట్లు, భద్రతా దళాల మధ్య కాల్పులు కూడా జరిగాయి. కొందరు గాయపడ్డారు. మరోవైపు మణిపూర్ పోలీసులు, అస్సాం రైఫిల్స్ మధ్య వాగ్వాదం జరిగింది. మైతీ ఆధిపత్య జిల్లా బిష్ణుపూర్లో హింసాత్మక సంఘటనలను అదుపు చేసేందుకు తమను అనుమతించకపోవడంపై మణిపూర్ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్సాం రైఫిల్స్ జవాన్లతో వాగ్వాదానికి దిగారు. ఆర్మీ బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలతో క్వక్తా గోథోల్ రోడ్ను బ్లాక్ చేయడంపై అభ్యంతరం తెలిపారు. అలాగే అస్సాం రైఫిల్స్ జవాన్లు కుకీ మిలిటెంట్లతో కుమ్మక్కయ్యారని మణిపూర్ పోలీసులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సైనికులు, పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.