నవతెలంగాణ – చండీగఢ్: హరియాణాలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. కల్తీ మద్యం సేవించి తాజాగా 19 మంది మృతి చెందడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనకు ప్రధాన నిందితులుగా గుర్తిస్తూ 7 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. యమునానగర్లోని మండేబరి, పంజేటో కా మజ్రా, ఫ్రూస్గఢ్, సరన్ గ్రామాలు, పొరుగున ఉన్న అంబాలా జిల్లా గ్రామాల్లోని పలు షాపులకు కల్తీ మద్యం సరఫరా చేశారు. అది తాగిన 19 మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనలో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత గ్రామస్థులు మద్యం వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో అరెస్టైన వారిలో ఓ కాంగ్రెస్ నేత, జననాయక్ బీజేపీ నేత కుమారుడితోపాటు మరో అయిదుగురు ఉన్నారు. ఈ ఘటన రాజకీయ వేడిని రాజేసింది. హరియాణా పౌరులు ఏళ్లుగా కల్తీ మద్యం బారిన పడుతున్నా.. ప్రభుత్వం స్పందించట్లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కల్తీ మద్యాన్ని అరికట్టడంలో ఫెయిల్ అయ్యారని మండిపడ్డాయి.