నవతెలంగాణ-హైదరాబాద్ : దుబాయ్ వేదికగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) – 2023 వేడుక ఘనంగా జరుగుతోంది. రెండు రోజులు జరగనున్న ఈ వేడుకల్లో నటీనటులు హాజరై సందడి చేస్తున్నారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’లో తన అద్భుతమైన నటనకు గానూ ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ అవార్డు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వేదికపై మాట్లాడిన మాటలు అభిమానుల హృదయాలను హత్తుకుంటున్నాయి. ‘‘నా ఒడుదొడుకుల్లో అభిమానులు తోడున్నారు. నేను కిందపడ్డ ప్రతిసారి వారు నన్ను పట్టుకుని పైకి లేపారు. నా కంటి వెంట వచ్చిన ప్రతి కన్నీటి చుక్కకు వాళ్లు కూడా బాధపడ్డారు. నేను నవ్వినప్పుడల్లా సంతోషపడ్డారు. నన్ను అభిమానించే అందరికీ తలవంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే నాపై నమ్మకంతో కొమురం భీమ్ లాంటి గొప్ప పాత్రను ఇచ్చినందుకు రాజమౌళికి ధన్యవాదాలు. ఇక నా సహనటుడు, నా సోదరుడు, స్నేహితుడు చరణ్కు కూడా ఈ సందర్భంగా థ్యాంక్యూ చెబుతున్నాను’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.