– బిజెపి ఎంపి రమేష్ బిధూరిపై చర్యలు తీసుకోని స్పీకర్
న్యూఢిల్లీ : ముస్లింలను లక్ష్యంగా చేసుకుని బిఎస్పి ఎంపి కున్వార్ దనిష్ అలీపై హిందీలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎంపి రమేష్ బిధూరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబడుతున్నా కేంద్రం స్పందించలేదు. ఎంపి రమేష్ బిధూరికి స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా హెచ్చరింపులతో సరిపెట్టారు. ఇలాంటి ప్రవర్తన పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పీకర్ హెచ్చరించారు. మరోవైపు బిజెపి బిధూరికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్లమెంట్లో అభ్యంతరకమైన భాషను ఉపయోగించినందుకు ఎందుకు పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలని ప్రశ్నించింది. షోకాజ్ నోటీసుపై స్పందించేందుకు 15 రోజుల వ్యవధి ఇచ్చింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా గురువారం సాయంత్రం చంద్రయాన్-3పై చర్చ జరిగింది. ఈ చర్చలో రమేష్ బిధూరి మాట్లాడుతున్నప్పుడు బిఎస్పి ఎంపి అలీ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. దీంతో బిధూరి తీవ్రమైన మత దూషణలకు పాల్పడ్డారు. బిధూరి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెళ్లువెత్తాయి. పార్లమెంట్ నుంచి బిధూరిని సస్పెండ్ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. బిధూరికి వ్యతిరేకంగా స్పీకర్కు దనిష్ అలీ స్వయంగా ఫిర్యాదు చేశారు. స్పీకర్కు అందచేసిన లేఖలో బిధూరి తనపై ఉపయోగించిన అభ్యంతరకరమైన పదాలను అలీ లిస్ట్ చేశారు. ‘ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటన నూతన పార్లమెంటుభవనంలో, స్పీకర్గా మీ నాయకత్వంలో జరగడం విచారకరం. ఒక మైనార్టీ సభ్యుడిగా నాకు నిజంగా హృదయ విదారకంగా ఉంది’ అని లేఖలో తెలిపారు. అలాగే, బిధూరి వ్యాఖ్యలను లోక్సభ ప్రత్యేకాధికారాల కమిటీకి సూచించాలని డిమాండ్ చేశారు. బిజినెస్ రూల్స్ ప్రవర్తనలోని 222, 226, 227 నిబంధనలను గుర్తు చేశారు.స్పీకర్కు ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో అలీ మాట్లాడారు. ‘మనం ప్రజాస్వామ్యానికి తల్లి అని చెప్పుకుంటాము. అయితే ప్రజాస్వామ్యంలో దేవాలయంగా భావించే పార్లమెంట్లో ఒక ఎన్నికైన ఎంపిపై ముల్లా, కత్వా (సున్తీ), ఉగ్రవాదులు వంటి పదాలు ఉపయోగించారు. దీంతో క్షోభించిన నేను నిన్న రాత్రి నుండి నేను నిద్రపోలేకపోయాను’ అని తెలిపారు. బిధూరి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. బిధూరి మతపరమైన దూషణలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయడం సరిపోదని, బిధూరిని లోక్సభ నుండి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ డిమాండ్ చేశారు. మొహువా మొయిత్రా (టిఎంసి), అసదుద్దీన్ ఒవైసీ (ఎఐఎంఎం) వంటి ప్రతిపక్ష ఎంపిలు కూడా బిధూరిని లోక్సభ నుండి సస్పెండ్ ేయాలని కోరారు.