– బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
నవతెలంగాణ – హుజురాబాద్
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్పైన గజ్వేల్లో, హుజురాబాద్లోనూ పోటీ చేస్తానని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మెన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ఓ గార్డెన్లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను ఇంతవాన్ని చేసిన హుజురాబాద్ గడ్డపై రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని.. సీఎం కేసీఆర్ను ఓడించడానికి ఆయనపై కూడా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కొంతమంది చిల్లరగాళ్లు తనను కేసీఆర్ కోవర్టుగా ప్రచారం చేస్తున్నారని.. తాను మాత్రం రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని చెప్పారు. కొత్త రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని పాడు చేసిన దుర్మార్గపు పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు. ‘కేసీఆర్ వల్ల నరకం అంటే ఏందో సంపూర్ణంగా అనుభవించిన వాడిని నేను.. అందువల్ల ఎన్నికల్లో నా వేడి, నా శక్తి మొత్తం వినియోగిస్తాను’ అన్నారు. ఈ నెల 16న కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్ హుజురాబాద్కు వస్తున్నారని, ఆ సభను విజయవంతం చేయాలని కోరారు.