నవతెలంగాణ హైదరాబాద్: గత ఎన్నికల్లో వచ్చిన 88 కంటే ఎక్కువ స్థానాల్లో తాము గెలుస్తామని బీఆర్ఎస్(BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్(KTR) విశ్వాసం వ్యక్తం చేశారు. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన కేటీఆర్ ఎన్నికలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. అక్కడక్కడ ఎమ్మెల్యేలపై చిరు కోపం ఉన్నా, ప్రజలకు కేసీఆర్(KCR) నాయకత్వంపై దృఢమైన విశ్వాసం ఉందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసి 60 రోజులైందని, బీఫారాలను కూడా అందించామని తెలిపారు. ప్రచారంలో కూడా ముందున్నామన్న కేటీఆర్.. ఫలితాల్లోనూ తామే ముందే ఉంటామని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్కు(CONGRESS) 40 చోట్ల అభ్యర్థులు లేరని, అదే బీజేపీ(BJP) అయితే యుద్ధానికి ముందే చేతులెత్తేసిందని విమర్శించారు. బీజేపీ అభ్యర్థులు ఈసారి 110 స్థానాల్లో డిపాజిట్ కోల్పోతారని జోష్యం చెప్పారు. కాంగ్రెస్ పదేండ్ల పాలనలో ఏపీపీఎస్సీ ద్వారా జరిగిన ఉద్యోగ నియామకాలు 24 వేలు అని చెప్పిన కేటీఆర్.. అందులో తెలంగాణ వాటా 10 వేలు మాత్రమే అని వివరించారు. తమ ప్రభుత్వ హయాంలో 1,34,000 ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని, మిగిలిన 90వేల నియామకాలు వివిద దశల్లో ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ ఏడాదికి వెయ్యి ఉద్యోగాలు ఇస్తే.. తాము 13వేలు ఇచ్చామని వెల్లడించారు. భారాస 30 వైద్య కళాశాలలు పెట్టిందని గుర్తు చేశారు.
విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు.. ఇలా అన్ని రంగాల్లో కాంగ్రెస్ ఏం చేసిందో.. మా ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తమకు ఏ మాత్రం పోటీ కాదని, రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ నేతలు తమ ఏమాత్రం సరితూగరని విమర్శించారు. కర్ణాటకలో 5 గంటల కరెంటు కోత వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్లో ఒకే పంటను పరిమితి మేరకు కొనుగోలు చేస్తారని, వాళ్లు మాకు సుద్దులు చెబుతారా? అని విమర్శించారు. గతంలో ఖమ్మంలో తమకు నేతలు నిండుగా ఉన్నా… ఒక్క సీటు మాత్రమే వచ్చిందన్నారు. ఈసారి కొందరు నేతలు వెళ్లారు.. సీట్లు పెరుగుతాయని అనుకుంటున్నాం. మణికొండ, మక్తల్లో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢిల్లీకి బానిసలని విమర్శించారు.
‘‘పార్లమెంట్లో రాహుల్ గాంధీ.. మోడీని కౌగిలించుకోలేదా? కన్ను గీటలేదా?. రెండు పార్టీలు భాగస్వామ్య పార్టీలు. మనికొండ, మక్తల్లో ఇంకా రెండు పార్టీలు కలిసే ఉన్నాయి. కరీంనగర్, నిజామబాద్లో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేయలేదా? మజ్లిస్ మతతత్వ పార్టీ కాదు, వారితో మాకు పొత్తు లేదు. కేవలం ఫ్రెండ్లీ పార్టీ మాత్రమే. గతంలో కాంగ్రెస్ రూ.2లక్షల రుణమాఫీ అంటే ఎవరూ పట్టించుకోలేదు, ఇప్పుడు కూడా అంతే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు. రాహుల్ గాంధీ(RAGUHAL GANDHI) దోసెలు, ఇడ్లీలు వేసుకుంటే బాగుంటుంది. కేసీఆర్ తెలంగాణ(TELANGANA) ప్రజల ఆస్తి, ఆయన ఎక్కడైనా పోటీ చేస్తారు’’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.