– డబ్ల్యూటీసీ ఫైనల్పై రికీ పాంటింగ్
న్యూఢిల్లీ : ఐసీసీ 2023 ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాకు కాస్త అనుకూలత ఉండనుందని ఆ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ వేదిక లండన్లోని ది ఓవల్ మైదానం. అక్కడి పరిస్థితులు ఆస్ట్రేలియాను పోలి ఉంటాయి. ఇది ఆసీస్కు కాస్త మొగ్గు. ఈ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియాలో ఎక్కడ జరిగినా ఆతిథ్య జట్టు ఫేవరేట్గా ఉండేది. కానీ వేదిక ఇంగ్లాండ్ కావటంతో సరసమైన పోటీకి అవకాశం ఏర్పడింది’ పాంటింగ్ అన్నారు. 1990-2000 భారత జట్లతో పోల్చితే ప్రస్తుత టీమ్ ఇండియా విదేశీ గడ్డపై ఎంతో మెరుగ్గా రాణిస్తుంది. బ్యాటింగ్ నైపుణ్యం, వికెట్ల వేటలో పదును బాగున్నాయి. గత 10-15 ఏండ్లలో భారత్ నాణ్యమైన పేసర్లను తయారు చేసింది. బుమ్రా లేకపోవటం లోటే, కానీ ఇంగ్లాండ్ పరిస్థితుల్లో మహ్మద్ షమి ప్రమాకర పేసర్. విరాట్ కోహ్లికి బౌలింగ్ చేయటం ఏ బౌలర్కైనా సవాలే. ఇటీవల బెంగళూర్లో కోహ్లితో మాట్లాడాను. కెరీర్ ఉత్తమ దశలోకి మళ్లీ వచ్చినట్టు అతడు చెప్పాడు. సన్రైజర్స్పై మ్యాచ్లో అందరం అది చూశాం. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఉత్కంఠ పోటీ కోసం ఎదురు చూస్తున్నాను’ అని పాంటింగ్ అన్నారు.