నవతెలంగాణ – హైదరాబాద్
టీమ్ఇండియా వరుసగా రెండోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు చేరింది. బుధవారం నుంచి ఆసీస్తో తలపడేందుకు సిద్ధమవుతోంది. గత డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్పై న్యూజిలాండ్ విజయం సాధించింది. వర్షం వల్ల పిచ్ బౌలింగ్కు అనుకూలంగా మారినప్పటికీ.. స్పిన్నర్లతో బరిలోకి దిగిన టీమ్ఇండియాకు ఫలితం అనుకూలంగా రాలేదు. అశ్విన్, రవీంద్ర జడేజా విఫలం కావడం భారత్ ఓటమికి ప్రధాన కారణం. అదనంగా పేసర్ లేకపోవడం కూడా టీమ్ఇండియాకు కలిసిరాలేదు. ఈసారి కూడా ఇంగ్లాండ్ వేదిక కావడంతో పిచ్ పేస్కు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ స్పిన్నర్లకూ సహకరిస్తుందనే వాదనా ఉంది. దీంతో తుది జట్టు కూర్పుపై మాజీలు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ సున్నితంగా హెచ్చరించాడు. ఆసీస్ను వారి దేశంలోనే ఓడించిన భారత్.. ఎలాంటి పిచ్లపైనైనా గెలవగలదని వ్యాఖ్యానించాడు. ‘‘వాతావరణం బాగుండి.. ఎండ ఎక్కువగా ఉంటే తన రెగ్యులర్ ఫార్ములాతోనే టీమ్ఇండియా బరిలోకి దిగుతుంది. ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు సీమర్లతోపాటు మూడో పేసర్గా శార్దూల్ ఠాకూర్ను తీసుకొనే వీలుంది. ఎండ ఉండటం వల్ల పేస్, స్పిన్కు పిచ్ సమానంగా అనుకూలించే అవకాశాలు మెండుగా ఉంటాయి. అయితే, గత డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ను ఓసారి గుర్తు చేసుకుంటే.. అప్పటి పిచ్ పరిస్థితులను టీమ్ఇండియా తప్పుగా అర్థం చేసుకున్నట్లు అనిపించింది. ఐదు రోజులూ లైట్లు ఆన్లోనే (వర్షం వల్ల) ఉన్నాయి. తేమ వాతావరణం ఉంది. అందుకే, కివీస్ ప్రధాన స్పిన్నర్తో కూడా బరిలోకి దిగలేదు. అయితే, భారత్ మాత్రం ఇద్దరు స్పిన్నర్లతో ఆడింది. సీమ్, స్వింగ్ ప్రభావం చూపిన పిచ్పై అలా తుది జట్టును ఎంపిక చేసుకుంది. ఈ సారి అలాంటి పొరపాటును పునరావృతం చేయకూడదు.