నవతెలంగాణ – ఢిల్లీ: జూన్ నెల ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా ఎండలు ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. దేశవ్యాప్తంగా పలు చోట్ల 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీలు, కూలర్లు ఎక్కువగా వాడుతుండటంతో విద్యుత్ వినియోగం అమాంతం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో దిగుమతి ఆధారిత ధర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబరు 30 వరకు ప్లాంట్లలో పూర్తి సామర్థ్యంతో విద్యుత్ను ఉత్పత్తి చేయాలని ఉత్వర్వులు జారీ చేసింది. విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని ఫిబ్రవరిలో తొలిసారి ఆదేశాలు జారీ చేసిన కేంద్రం.. మార్చి 16 నుంచి జూన్ 15వరకు మూడు నెలలపాటు పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయాలని కోరింది. అయితే, ఈ గడువు ముగుస్తున్నప్పటికీ.. ఎండల తీవ్రత తగ్గకపోవడంతో తాజాగా ఉత్తర్వులను పొడిగించింది. గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా కరెంటు వినియోగం శుక్రవారం రికార్డు స్థాయిలో 223 గిగావాట్ల మేర నమోదైంది. ఆదివారం 206.6 గిగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. అయితే, ఈ ఏడాదిలో గరిష్ఠ విద్యుత్ వినియోగం 230 గిగావాట్లకు చేరే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేస్తోంది. మరోవైపు వేసవి నేపథ్యంలో విద్యుత్ కొరత లేకుండా కేంద్రం అవసరమైన చర్యలు తీసుకుంటూనే ఉంది. గతంలో దిగుమతి చేసుకున్న దానికంటే సెప్టెంబరు నెలాఖరు వరకు 6 శాతం బొగ్గును అధికంగా దిగుమతి చేసుకోవాలని జెన్కో సంస్థలకు ఈ ఏడాది ప్రారంభంలోనే కేంద్రం దిశానిర్దేశం చేసింది. అంతేకాకుండా వినియోగం ఎక్కువగా ఉన్న సమయంలో గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో పని చేయాలని కోరింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన బొగ్గు సకాలంలో చేరేలా రైల్వే, బొగ్గు మంత్రిత్వశాఖలతో సమన్వయం చేసుకుంటున్నట్లు కేంద్ర విద్యుత్శాఖ వెల్లడించింది. వీలైనంత త్వరగా బొగ్గును చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా బొగ్గు తవ్వకాలను పెంచాలని, అవసరమైతే విదేశాల నుంచి బొగ్గు దిగుమతిని పెంచాలని సంబంధిత శాఖను కోరినట్లు చెప్పింది.