నవతెలంగాణ- హైదరాబాద్: తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు వద్ద ఉన్న మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఇవాళ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. మై హోమ్ సంస్థకు చెందిన సిమెంట్ కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు వలస కార్మికులు మృతి చెందడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ పనులు జరుగుతుండగా లిఫ్ట్ కూలిపోయి, ఈ ప్రమాదం జరిగినట్టు మీడియా ద్వారా తెలిసిందని వెల్లడించారు. బాధిత కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. మృతుల కుటుంబాలకు న్యాయబద్ధమైన ఆర్థిక పరిహారాన్ని అందించాలని పవన్ కల్యాణ్ సూచించారు. కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలను పాటించడం, ఆ ప్రమాణాలను సంబంధిత శాఖలు పర్యవేక్షిస్తుండాలన్న అవసరాన్ని ఈ ఘటన చాటిచెబుతోందని పేర్కొన్నారు. పొట్టకూటి కోసం రాష్ట్రాలు దాటి వస్తున్న కార్మికుల జీవితాలకు ప్రభుత్వాలు, కర్మాగారాల యాజమాన్యాలు భరోసా కల్పించాలని సలహా ఇచ్చారు.