నవతెలంగాణ – చెన్నై: మణిపూర్ పరిస్థితులను అదుపు చేయడంలో బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ చెన్నైలో కేంద్రానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి డి రాజా స్పృహతప్పి పడిపోయారు. మణిపూర్లో మహిళలపై జరుగుతున్న హింసను సీపీఐ ఖండిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించింది. ఈ క్రమంలో డి రాజా విలేకరులతో మాట్లాడుతూనే తల తిరగడంతో కిందపడిపోయారు. డీ రాజాకు కళ్లు తిరుగుతున్నట్లుగా అనిపించి మాట్లాడుతూనే కుప్పకూలిపోగా, పార్టీ కార్యకర్తలు ఆయనను కారు వద్దకు తీసుకెళ్లి, దగ్గరలోని స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన ఇంటికి వచ్చారు. డీ రాజా పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు.