నవతెలంగాణ – హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మహిళా ప్రయాణికులకు బహుమతులను అందజేయాలని నిర్ణయించింది. మహిళలు సుదూర ప్రాంతాల్లో ఉన్న సోదరుల వద్దకు వెళ్లి రాఖీ కడతారని..అందుకే వారి కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించినట్లు సంస్థ తెలిపింది. ఈ లక్కీ డ్రాలో ఎంపికైన మహిళలకు రూ.5.50 లక్షలు విలువైన బహుమతులు అందజేయనుంది. ప్రతి రీజియన్ పరిధిలో ముగ్గురు చొప్పున మొత్తంగా 33 మంది ఆడపడుచులకి బహుమతులను ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల 30, 31వ తేదీల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చని ఆర్టీసీ తెలిపింది. ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్ రాసి.. వాటిని బస్టాండ్ల్లో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ లలో వేయాలని సూచించింది. సెప్టెంబర్ 9లోగా లక్కీ డ్రా తీసి విజేతలకు ప్రకటిస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.