– గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
నవతెలంగాణ-యాచారం
పక్కా ప్లాన్తో ఓ మహిళను దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. సీఐ రామాంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరు మండలం ముచ్చర్ల వ్యవసాయ పొలంలో గుర్తుతెలియని మహిళా మృతదేహం ఉన్నట్టు స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. మహిళా మృతదేహాంపై ఉన్న ఆనవాళ్లను గుర్తించారు. మిస్సింగ్ కింద 14వ తేదీన రాత్రి 9 గంటలకు మంచాల మండలం పోలీస్ స్టేషన్లో మంథని అర్చన తమ అమ్మ యాదమ్మ రాత్రి అవుతున్నా తిరిగి ఇంటికి రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముచ్చర్ల గ్రామం దగ్గర దొరికిన మృతదేహం అనవాళ్లను మంచాల పోలీసులకు తెలియజేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంచాల మండలం జాపాల గ్రామానికి చెందిన మంథని యాదమ్మ (38)గా పోలీసులు గుర్తించారు. ఫార్మాసిటీ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతురాలు మంథని యాదమ్మ తుర్కయంజాల్ కరెంట్ ఆఫీస్లో స్వీపర్గా పనిచేస్తోంది. మంచాల మండలం జాపాల గ్రామం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి సాయంత్రం పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తుంది. అలా 14వ తేదీన రాత్రి 9 గంటలు అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కూతురు మంచాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మృతురాలిని గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సీఐ రామాంజనేయులు తెలిపారు.