నవతెలంగాణ – విశాఖపట్నం: షీలా నగర్ పోర్ట్ రోడ్డు మారుతి సర్కిల్ వద్ద అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సుజుకి బెలునో కారును గూడ్స్ రైలు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు కుటుంబ సభ్యులు తృటిలో తప్పించుకున్నారు. పోర్ట్ నుంచి స్థానిక వేర్ హౌజ్లకు వెళ్ళే రైల్వే లూప్ లైన్పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీహరి పురం నుంచి విశాఖ సిటీ కి వచ్చే క్రమంలో ఉన్న రైల్వే లైన్ ను క్రాస్ చేసే సమయంలో ఘటన చోటు చేసుకుంది. లూప్ లైన్ను క్రాస్ చేసే ప్రయత్నంలో కారు ట్రాక్ మధ్యలో ఆగిపోయింది. ఈ విషయాన్ని గమనించి లోకో పైలట్ రైలును బాగా స్లో చేశారు. ట్రైన్ను గమనించి వెంటనే కారు డోర్ లు తెరచి బయటకు దూకి స్వల్ప గాయాలతో ప్రయాణికులు ప్రాణాపాయం తప్పించుకున్నారు. కారులో ఉన్నది రిటైర్డ్ నేవీ అధికారి కుటుంబంగా గుర్తించారు. అయితే వారి వివరాలు బయటకు చెప్పేందుకు మాత్రం నిరాకరిస్తున్నారు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.