నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర అవతరణను సాకారం చేసిన తెలంగాణ అమరవీరుల స్మారకార్థం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారకం గురువారం ప్రారంభం కానుంది. హుస్సేన్సాగర్ తీరంలో గతంలో ఉన్న లుంబినీపార్కు స్థలంలో సచివాలయ భవనానికి ఎదురుగా నిర్మించిన ఈ స్మారకాన్ని గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అతుకుల్లేని స్టెయిన్లెస్ స్టీల్తో నిర్మించిన ఈ కట్టడం నగరంలో పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. అద్దంతో నిర్మించినట్టుండే ఈ కట్టడం ప్రపంచంలోనే నాలుగోది కావటం విశేషం. జర్మనీ తయారీ స్టెయిన్లెస్ స్టీల్ను దుబాయ్లో నిపుణులు ప్రీఫ్యాబ్రికేటెడ్ చేసి నగరానికి తరలించి అతికించి రూపొందించారు. కేవలం జర్మనీ తయారీ స్టెయిన్లెస్ స్టీల్కే దాదాపు రూ.50కోట్లు వ్యయం చేశారు. రూ.177 కోట్ల వ్యయంతో ఆరు అంతస్తుల్లో నిర్మించిన ఈ భవనం 26,800చ.మీ.ల విస్తీర్ణంలో రూపొందింది. 45 మీటర్ల ఎత్తుతో దీపం జ్వలిస్తున్నట్టు ప్రమిద ఆకారంలో నిర్మించిన ఈ భవనం ఆకట్టుకుంటోంది.