నవతెలంగాణ -యాదగిరిగుట్ట: అభం శుభం తెలియని మూడేళ్ల బాలుడిని వీధి కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి, ఆ బాలుడు గాయపడి విలవిలలాడిపోయాడు. ఈ హృదయ విదారక ఘటన యాదగిరిగుట్ట మండలంలోని సాదువెల్లి గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుంకే హరీష్ వ్యవసాయదారుడు, అతని మూడేళ్ల కుమారుడు శశిధర్ అంగన్వాడి కేంద్రంలో చేర్పించారు, రోజులాగే ఆ బాలుడిని అంగన్వాడికి పంపించి వారు వ్యవసాయ పనులకు వెలుతారు. గురువారం సాయంత్రం అంగన్వాడి కేంద్రం నుండి ఇంటికి వెళ్లే క్రమంలో ఆ బాలుడు పై వీధి కుక్కలు చుట్టూ ముట్టి విచక్షణ రహితంగా దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడు శరీరాన్ని చిద్రం చేస్తున్న కుక్కలను స్థానికులు చూసి వెళ్ళగొట్టారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో హుటా హుటిన ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం చేసిన వైద్యులు బాలుడికి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, గ్రామంలో వందల సంఖ్యలో విధి కుక్కలు ఉన్నాయని, ఇప్పటికైనా అధికారులు, గ్రామ పంచాయతీ పాలకవర్గం మేలుకొని వీధి కుక్కల దాడుల నుండి కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.