నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతవరకు కల్వకుంట్ల కుటుంబంలోని వ్యక్తే సీఎం అవుతారని, మరొకరికి ఆ అవకాశం ఉండదని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఆయన హైదరాబాద్లో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పార్టీ అధ్యక్ష పదవుల్లోనూ కేసీఆర్ కుటుంబ సభ్యులే ఉంటారన్నారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం 70 శాతం మందికి కేంద్ర కేబినెట్లో చోటు కల్పించిందన్నారు. ఇతర రాష్ట్రాల బీఆర్ఎస్ ఇంచార్జులు కూడా కల్వకుంట్ల కుటుంబ సభ్యులే ఉంటారన్నారు. ఇతర వర్గానికి లేదా ఇతర కుటుంబాలకు ఎక్కడా అవకాశం దొరకదని విమర్శించారు. తెలంగాణ వస్తే బడుగులకు అధికారం, జీవితాల్లో వెలుగు వస్తుందని చెప్పారు కానీ కేసీఆర్ కుటుంబంలో మాత్రమే వచ్చిందన్నారు. పదవులు వచ్చింది కూడా వారి కుటుంబానికే అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించిన ప్రజల బతుకులు ఆగమయ్యాయని, రాజ్యాధికారంలో భాగం ఇస్తామని ఎస్సీలను మోసం చేశారన్నారు. బీసీల పట్ల చులకనభావంతో ఉన్నారన్నారు.