నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వాయిదా పడే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ భావిస్తోంది. అక్టోబర్ లో షెడ్యూల్ విడదల కాకపోతే వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరగవచ్చని అంచనా వేస్తోంది. జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిశితంగా పరిశీలిస్తున్న బీఆర్ఎస్ అధిష్ఠానం.. ఈ అంశంపై గత కొద్ది రోజులుగా ముఖ్య నాయకులతో చర్చిస్తోంది. ఒకవేళ పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు కలిసి నిర్వహించినా.. బీఆర్ఎస్ కే లాభమనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. బీఆర్ఎస్ లో చర్చించిన అంశాలను ఒక ముఖ్యనేత వెల్లడించారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో ఒకే దేశం.. ఒకే ఎన్నిక బిల్లు పెట్టకపోతే.. అక్టోబరు 5-10 తేదీల్లో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావాలి. అలాంటప్పుడు రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో వేసిన కమిటీకి ఆరు నెలల సమయం ఎందుకు ఇచ్చారు? ఇది ఆలోచించాల్సిన అంశం. అయోధ్యలో రామమందిరానికి ప్రారంభోత్సవం చేయకుండా మోడీ ఎన్నికలకు వెళ్లరు. జనవరి 22న ప్రారంభోత్సవం చేసిన వెంటనే కూడా ఎన్నికలకు వెళ్లలేరు. ఎందుకంటే ఫిబ్రవరిలో బడ్జెట్ పెట్టాలి. లేకపోతే జీతాలివ్వలేని పరిస్థితి ఉంటుంది. మార్చిలో పిల్లలకు పరీక్షలుంటాయి. దీంతో ఏప్రిల్, మే నెలల్లోనే పెట్టాల్సి వస్తుంది. రానున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎలాగూ ఓడిపోబోతున్నామని బీజేపీకి తెలుసు. అందుకే ఈ రాష్ట్రాలకు విడిగా ఎన్నికలు పెట్టకుండా.. మే నెల వరకూ వాయిదా వేసే అవకాశాలున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో అయిదు రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేయకపోతే.. ఎన్నికల కమిషన్ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ విధానాన్ని అమలు చేయకపోయినా.. ‘ఒకే దేశం.. రెండు ఎన్నికలు’ విధానాన్నైనా ఈసారి అమలు చేయొచ్చు. మోడీ ఒక్కరోజు కూడా అధికారాన్ని వదులుకోలేరు. అందువల్ల పార్లమెంటు ఎన్నికలను ముందుకు జరపకుండా.. ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలనే మే వరకూ వాయిదా వేసే అవకాశాలున్నాయి.
ఒకవేళ ఎన్నికలు వాయిదా పడితే రాష్ట్రంలో పాలనను ఆపద్ధర్మ ప్రభుత్వానికి అప్పగించకుండా.. రాష్ట్రపతి పాలన తీసుకొస్తే దానివల్ల బీజేపీకే ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీకి ఎంత చెడ్డ పేరు వచ్చిందో.. రాష్ట్రపతి పాలన పెడితే బీజేపీకి కూడా అంతకంటే ఎక్కువ చెడ్డపేరు వచ్చే అవకాశాలున్నాయి. ఎన్నికలను సమర్థంగా, ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొనే ధైర్యం లేక.. రాష్ట్రపతి పాలన పెట్టారని ఎదురుదాడి చేయడానికి ఒక ఆయుధం లభిస్తుంది. అలా బద్నామ్ అయ్యే పరిస్థితిని ఎదుర్కోవడానికి బీజేపీ సిద్ధంగా ఉంటుందా అనేది వేచి చూడాలి’ అని బీఆర్ఎస్ ముఖ్యనేత ఒకరు విశ్లేషించారు.