మధ్యాహ్నం భోజనానికి రాత్రి భోజనానికి మధ్య సమయం కనీసం 6 గంటలు అయినా ఉంటుంది. మధ్యాహ్నం తీసుకున్న భోజనాన్ని బట్టి ఒక్కోసారి సాయంత్రం ఆకలి వేస్తుంది. ఆకలి వేయగానే ఏది పడితే అది తినకూడదు. లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. తక్కువగా తిన్నా పొట్ట నిండినట్లుండాలి. అంతేకాదు తక్కువ కేలరీలు ఉండేలా చూసుకోవాలి. అటువంటి ఆహారాన్ని ఎంచుకోవడం ఉత్తమం. అవేంటో చూద్దాం…
పుచ్చకాయ : పుచ్చకాయను డైట్ స్నాక్గా చెప్పుకోవచ్చు. దీనిలో నీటి శాతం ఎక్కువ. ఒక పుచ్చకాయలో కేవలం 88 కేలరీలు మాత్రమే వుంటాయి.
చెర్రీ : చెర్రీ పళ్లలో విటమిన్లు పుష్కలంగా వుంటాయి. కొవ్వు పదార్ధం తక్కువగా వుంటుంది. 25 చెర్రీలలో కేవలం 100 కేలరీలే వుంటాయి.
బ్లూ బెర్రీలు : ఒక కప్పు బ్లూ బెర్రీలలో 83 కేలరీలు వుంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు విరివిగా వుండి, వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. రకరకాల గుండె జబ్బుల నుంచి కాపాడతాయి.
కివీ పండు : కివీలో విటమిన్ సి పుష్కలంగా అందుతుంది. కివీ పళ్ళు జీర్ణక్రియకు సాయం చేస్తాయి. ఆరోగ్యకరమైన మేని ఛాయను కూడా పెంచుతాయి. రెండు కివీ పళ్ళతో కడుపు నిండుతుంది. వీటిలో కేవలం 58 కేలరీలే వుంటాయి.
ఆపిల్ : రోజుకో ఆపిల్ తింటే డాక్టర్కి దూరంగా ఉండొచ్చని అంటుంటారు. యాపిల్లో ఉండే పీచు పదార్థం వాతావరణంలోని కాలుష్య కారకాల నుంచి రక్షిస్తుంది. కొవ్వును తగ్గిస్తుంది. ఒక యాపిల్లో కేవలం 100 కేలరీలు వుంటాయి.
ద్రాక్ష : కడుపు నిండాలి తక్కువ కేలరీలు కావాలంటే 100 కేలరీలు మాత్రమే కలిగి ఉండే ద్రాక్ష పళ్ళు సరైన ఎంపిక. 30 ద్రాక్ష పళ్ళు తింటే, రక్తహీనతను, అలసటను, కీళ్ళ నొప్పులను, కీళ్ళ వాతాన్ని, రుమాటిజంను తగ్గించడానికి దోహదం చేస్తాయి.
పల్లీలు : పల్లీలు చాలా ఆరోగ్యకరమైన, పోషక విలువలున్న చిరుతిండి. రోజుకు కొన్ని పల్లీలు తీసుకోవడం వల్ల చాలా సేపు కడుపు నిండిన అనుభూతి వుంటుంది. ఇందులో కేవలం 74 కేలరీలే వుంటాయి. తక్కువ గ్లూకోస్ కలిగి వుండటంతో పాటు శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి.
బాదం పప్పులు : సాయం సమయంలో ఆకలి అయితే బాదం పప్పులు చక్కటి చిరుతిండి. త్వరగా కడుపు నిండటంతో పాటు త్వరగా శక్తి వస్తుంది.