నవతెలంగాణ – అమరావతి
అచ్చంపేట మండలం పెదపాలెం ఎస్సీకాలనీకి చెందిన వెంకట్రావు, అదే కాలనీకి చెందిన అనితను వివాహం చేసుకున్నాడు. వీరికి వివాహమైన ఏడేళ్ల తర్వాత బిడ్డ జన్మించింది. ప్రసవం అనంతరం అనిత బిడ్డతోపాటు పుట్టింటిలో ఉంటోంది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం కాలనీకి పడమర వైపున ఉన్న భూముల్లో ఎండిన పిచ్చి మొక్కలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఆ మంటలు వ్యాపించి సమీపంలోని కాలనీని చుట్టుముట్టాయి. అనిత ఉంటున్న ఇంటికి మంటలు అంటుకున్నాయి. దీంతో ఇంట్లోని సిలిండర్ పేలింది. ఆ ధాటికి ఊయలలో ఉన్న చిన్నారి పల్లవి(ఏడాది రెండు నెలల వయసు) మంచం మీద పడిపోయింది. మంటల్లో చిక్కుకొని ముద్దగా మారింది. బిడ్డను కాపాడే ప్రయత్నంలో అమ్మమ్మ మేరి, తల్లి అనిత మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. ఓవైపు ఎండ వేడిమి, మరోవైపు ఈదురుగాలుల కారణంగా మంటలు కాలనీని తాకినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 12 పూరిళ్లు, పాకలు, వసారాలు దెబ్బతిన్నాయి. 5 ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. నిత్యావసరాలు, వంట పాత్రలు బూడిదయ్యాయి. అందరూ నిరాశ్రయులయ్యారు. మిగతా వారంతా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే రెండు అగ్నిమాపక యంత్రాలు గ్రామానికి చేరుకొని మంటలను అదుపుచేశాయి. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్, సత్తెనపల్లి ఆర్డీవో బి.ఎల్.రాజకుమారి, తహసీల్దార్ సి.పద్మాదేవి సహాయక చర్యలు చేపట్టారు.