నవతెలంగాణ – కందనూలు
నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల పరిధిలో జూన్ నెల 3 నుంచి బడి బాట కార్యక్రమం ప్రారంభం కానున్నదని, జూన్ 17 వరకు స్పెషల్ ఎన్రోల్ మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు డిఈవో గోవిందరాజులు బుధవారం సాయంత్రం ప్రకటనలో తెలిపారు. సోమవారం బడి బాటకు సంబంధించిన షెడ్యూల్?ను జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మండల విద్యాధికారులకు స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులకు పంపించినట్లు ఆయన తెలిపారు. జూన్ 1న స్కూల్ లెవెల్?లో బడిబాట సన్నాహక సమావేశం నిర్వహించి.. జూన్ 3 నుంచి 9 వరకు అన్ని గ్రామాలు, ప్రాంతాల్లో ప్రత్యేక అడ్మిషన్ డ్రైవ్ చేపట్టాలని అధికారులకు డిఈవో సూచించారు. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి 11గంటల వరకు అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందన్నారు. పిల్లలు సర్కారు బడిలో చేరేలా ర్యాలీలు, బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాలతోపాటు డోర్ టూ డోర్ క్యాంపెయిన్ చేపట్టాలన్నారు. మన ఊరు మన బడి, ఇంగ్లిష్ మీడియం, ఎఫ్ఎల్ఎన్? తదితర సర్కారు స్కీమ్స్ గురించి తల్లిదండ్రులకు వివరించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలని సూచించారు.