– పాలమూరు రణభేరిని జయప్రదం చేయండి
– టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్
నవతెలంగాణ-కేశంపేట
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపి, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం మండల పరిధిలోని ఇప్పలపల్లి గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గంలో నిర్వహించే కాంగ్రెస్ రణభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజలను మోసం చేసి గద్దినేక్కడమే బిఆర్ఎస్, బీజేపీ పార్టీల లక్షణమని ఎద్దేవా చేశారు. బిజెపి,బిఆర్ఎస్ పార్టీలకు బుద్ది చెప్పి ప్రజలకు భరోసా కల్పించాలనే ఉద్దేశ్యంతో ఏఐసీసీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్, నిరుద్యోగుల కోసం ప్రియాంక గాంధీ యూత్ డిక్ల రేషన్ ప్రకటించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో వేధింపులకు గురవుతున్న మహిళల రక్షణ కోసం ప్రియాంక గాంధీ డిక్లరేషన్ ప్రకటించనున్నారన్నారు. కాంగ్రెస్ రణ బేరికి తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయడం చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సష్టించిన రణభేరికి తరలి వెళ్లేందుకు కార్యకర్తలు నడుం బిగించాలన్నారు.నియోజకవర్గంతోపాటు , మండలంలోని కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య యాదవ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పట్లూరి జగదీశ్వర్, మండల పార్టీ అధ్యక్షులు గూడ వీరేశం, నాయకులు బాబార్ ఖాన్ , కర్ణాకర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి ,అందె మోహన్, గిరి యాదవ్, ఇబ్రహీం,కోడూరు రాములు , రావుల పెంటయ్య ముదిరాజ్, భాస్కర్ గౌడ్ పాల్గొన్నారు.