నవతెలంగాణ – హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ.. బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పలుచోట్ల బాంబులు పెట్టినట్లు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటూ అలర్ట్ అయ్యారు. నగరంలోని శ్రమ శక్తి భవన్, కాశ్మీర్ గేట్, ఎర్రకోట, సరితా విహార్ లో గుర్తు తెలియని బ్యాగులను ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీస్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించాయి. శ్రమశక్తి భవన్ సమీపంలో అమర్చిన బ్యాగులో ఏమీ కనిపించలేదని అధికారులు తెలిపారు. ఆ బ్యాగ్ అక్కడే ఉండే ఓ ఎలక్ట్రిషియన్ కు చెందినదిగా గుర్తించారు. మరోవైపు ఎర్రకోట, కాశ్మీర్ గేట్, సరితా విహార్ లోని ప్రాంతాల్లో ఉన్న బ్యాగులను సైతం అధికారులు పరీక్షించి చూడగా.. ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.