నవతెలంగాణ-హైదరాబాద్ : మంగళవారం మహారాష్ట్రలోని సర్కోలిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కేవలం ఐదారు సంవత్సరాల కాలంలోనే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని అలాంటిది అన్ని వనరుల పుష్కలంగా ఉన్న మహారాష్ట్ర మాత్రం అభివృద్ధిలో వెనుకబడడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలోని వనరులను ఉపయోగించుకుని ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీటీమ్ అని ప్రచారం చేస్తున్నారని, తాను ఎవరికీ ఏ టీమ్ కాదు, బీ టీమ్ కాదని స్పష్టం చేశారు. రైతులంతా బీఆర్ఎస్ తో ఉంటే మిగతా పార్టీలే మనకు బీ టీమ్ లుగా మారుతాయని చెప్పారు. బీఆర్ఎస్ అంటే భారత్ పరివర్తన్ పార్టీ అని కేసీఆర్ కొత్త నిర్వచనం చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాలలో 50 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ పాలించిందని కేసీఆర్ చెప్పారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, బీజేపీ.. అందరికీ మీరు అవకాశం ఇచ్చారని చెప్పారు. రైతులకు మంచి చేయాలని, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన ఉంటే వీళ్లలో ఎవరైనా చేయగలిగే వారని అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనే లేని వాళ్లకు అధికారం కట్టబెట్టొద్దని అన్నారు. బీఆర్ఎస్ మాత్రమే రైతుల పక్షాన నిలుస్తుందని, అభివృద్ధి చేసి చూపెడుతుందని పేర్కొన్నారు. ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ ముందుకు వెళుతున్నామని కేసీఆర్ చెప్పారు.