– పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి
నవతెలంగాణ-పరిగి
ఎమ్మెల్యే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. ఆదివారం పరిగి పట్టణ కేంద్రంలోని ఎస్ గార్డెన్లో పరిగి మండల బీఆర్ఎస్ కార్యకర్తల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డి నివాసం నుంచి ఎస్ గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు డప్పుల వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. పరిగి పట్టణ కేంద్రంలోని వివిధ వార్డుల నుంచి, పరిగి మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. కొట్లాడి తెచ్చుకున రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని అన్నారు. నేడు సంక్షేమ పథకాలు ప్రజాధరణ పొందుతున్నాయని తెలిపారు. ఎక్కడలేని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయని, ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. సంపదని పెంచు పేదలకు పంచు అనే నానితో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారని అన్నారు. పింఛన్లు ఐదువేలకు పెంచుతూ, కల్యాణ లక్ష్మి,రైతుబంధు వంటి పథకాలను పెంచుతూ సీఎం కేసీఆర్ కొత్త మేనిఫెస్టులో ప్రకటించారని తెలిపారు. కాంగ్రెస్ ఆచరణకు సాధ్యం కానీ ఆరు గారెంటీ పథకాలు ప్రకటించారని విమర్శించారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన వెంబడే ఇస్తానన్న హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పెట్టిన పథకాలు ఎన్నికల కోసమే తప్ప, ఆచరణకు సాధ్యం కావని అన్నారు. ప్రతి గ్రామంలో ఇప్పటికే కోటి రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. పరిగి మున్సిపాలిటీ కేంద్రంలో రూ.15 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు. కనుక ఎన్నికలు ఇంకా 40 రోజులు ఉన్నాయి కాబట్టి కార్యకర్తలు కష్టపడి పని చేయాలని సూచించారు. సంక్షేమ పథకాల గురించి ప్రజలకు చెప్పి బీఆర్ఎస్కు ఓటు వేసే విధంగా కృషి చేయాలని సూచించారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి బీఆర్ఎస్ జండా ఎగరవేయాలని సూచించారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, ఎంపీపీ అరవింద్ రావు, జడ్పీటీసీ హరిప్రియ ప్రవీణ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, పిఎసిఎస్ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి, బీఆర్ఎస్ పరిగి మండల అధ్యక్షుడు ఆంజనేయులు, మాజీ జెడ్పి కోఆప్షన్ సభ్యులు మీరు మహిముదలి, కౌన్సిలర్లు మౌలానా, కృష్ణ, కిరణ్, తాహిర్ అలీ, నాగేశ్వర్, వెంకటేష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ మంగు సంతు, పరిగి పట్టణ మహిళా అధ్యక్షురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.