– పార్టీల ఎజెండా సంక్షేమ పథకాలేనా..?
– హామీల్లో స్థానిక అంశాల ఊసేది.?
నవ తెలంగాణ మల్హర్ రావు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మేనిపేస్టో పై బిఆర్ఎస్, ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వ పథకాలపై బిజేపీ పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి తప్పా స్థానిక అభివృద్ధి, సమస్యలపై ఫోకస్ పెట్టకపోవడం.శోచనీయం.మేనిపేస్టోలు,సంక్షేమ పథకాల పైనే ఫోకస్ పెట్టి,స్థానిక సమస్యలు,అభివృద్ధిపై ఎలాంటి హామీలు ఇవ్వకుండా వివిధ పార్టీలు ప్రచారానికి వెల్లుతున్నాయి.గతంలో శాసన సభ ఎన్నికల సమయంలో సంక్షేమ పథకాలతోపాటు, స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలను ఎజెండగా చేసుకొని ముందుకెళ్ళేవి.స్థానిక సమస్యలపై గతంలో మేము ఇదీ చేస్తాం అది చేస్తామన్న నేతలు ఇప్పడు ఎన్నికల సమయంలో స్థానిక సమస్యలు,అభివృద్ధిపై మాట్లాడకపోవడంపై ప్రజల నుంచి సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
ఇవిగో స్థానిక సమస్యలు…
మంథని నియోజకవర్గంలోని మహాదేవపూర్, కాటారం,మల్హర్,మంథని,ముత్తారం మండలాల్లోని పలు గ్రామాల్లో ముఖ్యంగా రైతుల సమస్యలు ఎక్కువైయ్యాయి.మెడిగడ్డ,అన్నారం బ్యారేజ్ నిర్మాణాలతో బ్యాక్ వాటర్ భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బ్యాక్ వాటర్ లో వేలాది ఎకరాల్లో భూములు,ఇండ్లు ముంపునకు గురైయ్యాయి.అలాగే మానేరుపై నిర్మాణం చేపట్టిన చెక్ డ్యామ్ ద్వారా మానేరు పరివాహక ప్రాంతాల్లోని వేలాది ఎకరాల పొలాలు ఇండ్లు ముంపునకు గురైయ్యాయి.భూములు,ఇండ్లు నీట మునగకుండా శాశ్వత పరిస్కారం కోసం నిపుణులచే కరకట్టలు నిర్మాణం చేపట్టాలి.వరదలతో గత మూడు సంవత్సరాలుగా రైతులకు జరిగిన కోట్ల పంటల నష్టపరిహారం అందించాలి. చిన్న కాళేశ్వరం, వళ్లెంకుంట ఎత్తిపోతల పథకాలు అసంతృప్తిగా ఉన్నాయి,వాటిని పూర్తి చేయాలి. పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న తాడిచెర్ల ఓసీపీకి 500 మీటర్లు డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లు,భూములను జెన్కో కంపెనీ సేకరించేలా చర్యలు తీసుకొని బాధిత నిర్వాసితులకు పరిహారంతోపాటు,ఆర్అండ్ఆర్ ప్యాకేజి ఇప్పించి నిర్వాసితులను సురక్షితమైన ప్రాంతానికి తరలించాలి. కిషన్ రావుపల్లి నుంచి భూపాలపల్లి జిల్లా కేంద్రానికి అటవీ మార్గం నుంచి తారు రోడ్డు నిర్మాణం అయ్యేలా చూడాలి. భూగర్భ జలాలు అడుగంటకుండా, రోడ్లు ధ్వంసం కాకుండా,అడ్డు అదుపు లేకుండా అధిక వేగంతో వెళుతూ ప్రాణ నష్టం చేస్తున్న ఇసుక క్వారీల రద్దు చేసి,లారీల రవాణ అదుపు చేయాలి.రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయిస్తూ,కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి.పట్టా భూములతో సమానంగా ప్రభుత్వ భూములకు స్థానిక బ్యాంకుల్లో పంట రుణాలు ఇచ్చేలా చూడాలి.పలిమేలను .ప్రభుత్వం పేరుకే మండలంగా ప్రకటించిన అధికారులు,కార్యాలయాలు మహాదేవపూర్ లోనే ఉండటంతో ప్రజలు ఎదుర్కొంటున్నా ఇబ్బందులకు పరిస్కారం చూపాలి.నాలుగేళ్ళుగా నత్తనడకలో నిర్మాణానికి నోచుకొని ఓడెడ్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలి. పోతారం నుంచి లక్కారం వరకు ఎల్ఎంఎల్ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టడం.పేద్దపల్లి నుంచి భూపాలపల్లి రైల్వే మార్గం కలగానే మిగిలింది కాబట్టి ప్రజల కలను నెరవేర్చడం. మంథని డివిజన్ రెండు ముక్కలై ఇటు పేద్దపల్లి అటు భూపాలపల్లి జిల్లాల్లో ఉండటంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండటం,మంథని డివిజన్ కేంద్రములో వంద పడకల ఆసుపత్రి,మెడికల్ కాలేజి,యూనివర్సిటీ తదితర స్థానిక అభివృద్ధి,సమస్యలపై ద్రుష్టి సారించాలని మంథని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.
ఎజెండా మారింది…
బిఆర్ఎస్ తన మేనిపేస్టో ను విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళుతుంది. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో జోరుగా ప్రచారం చేస్తోంది.బిజేపీ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను రాష్ట్రములోను అమలు చేస్తామంటోoది.కాగా నేతలు స్థానికంగా అభివృద్ధి పనుల చేపడతామని, సమస్యలు పరిష్కారం చేస్తామని ఎక్కడా ప్రస్తావించడం లేదు.