నవతెలంగాణ – ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నక్సలైట్లు జరిపిన ఐఈడీ పేలుళ్లలో పోలింగ్ విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్) జవాన్ గాయపడ్డారు. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా తెలిపారు. గాయపడిన జవాన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో గల నక్సలైట్ల ఉనికికి పేరుగాంచిన తొండమార్క ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో ఈ ఘటన జరిగింది. సీఆర్పీఎఫ్, కమాండో బెటాలియన్స్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ 206వ బెటాలియన్తో కూడిన జాయింట్ టీమ్ పోలింగ్ భద్రత కోసం పనిచేస్తోంది. తొండమార్క క్యాంపు నుంచి ఎల్మగుండ గ్రామం వైపు ఏరియా డామినేషన్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఈ క్రమంలో కోబ్రా 206వ బెటాలియన్కు చెందిన ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ప్రమాదవశాత్తూ నక్సలైట్లు అమర్చిన ఐఈడీని పేలుళ్లలో గాయపడినట్లు చెప్పారు. కాగా 90 అసెంబ్లీ స్థానాలు గల ఛత్తీస్గఢ్లో నేడు 20 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. వీటిలో 12 ఎస్టీ స్థానాలు, ఒక ఎస్సీ స్థానం ఉన్నాయి.