నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్ సింగరేణి సంస్థకి పక్షపాతి అనీ, ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సింగరేణి సంస్థను ప్రయివేటీకరించి నిర్వీర్యం చేయాలన్న కేంద్రం కుట్రను కేసీఆర్ అడ్డుకున్నారన్నారు. సింగరేణ సంస్థ లాభాల్లో 32 శాతం వాటాను కార్మికులకు పంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బుధవారం హైదరాబాద్లో టీబీజీకేఎస్ సంఘం నాయకులు కవితను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులను సీఎం కేసీఆర్ ఎప్పడూ మరచిపోరని అన్నారు. అవకాశమున్న ప్రతిసారీ కార్మికులకు ప్రయోజనాలు కల్పిస్తున్నారని తెలిపారు. కార్మికులకు అత్యధిక బోనస్ ప్రకటించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అనీ, 2014లో 18 శాతం బోనస్ ఉండగా 2022 నాటికి 30 శాతానికి పెంచామని చెప్పారు. ఈ సారి 32 శాతానికి పెరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ జనరల్ సెక్రెటరీ మిరియాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.