నవతెలంగాణ-హైదరాబాద్ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బోధనలే శిరోధార్యంగా భావించిన తెలంగాణ ప్రభుత్వం దళితులు స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలన్న ఆశయంతో “దళితబంధు” అనే విప్లవాత్మక పథకాన్ని అమలు చేస్తున్నది. చరిత్రలో మునుపెన్నడూలేనివిధంగా రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల మొత్తాన్ని నూరుశాతం గ్రాంట్ గా అందిస్తున్నది. దీనిని లబ్ధిదారులు తిరిగి చెల్లించనవసరం లేదు. ఈ ధనంతో దళితులు తమకు నచ్చిన, ఇష్టం వచ్చిన ఉపాధిని ఎంచుకొని, ఆత్మగౌరవంతో జీవించడానికి ప్రభుత్వం అండదండగా నిలుస్తున్నది.
దళిత బంధు పథకం కింద ప్రభుత్వం ఇప్పటివరకూ 50 వేల మంది లబ్దిదారులకు 5 వేల కోట్ల రూపాయలను అందించింది. ఈ ఏడాది బడ్జెట్ లో ఈ పథకానికి 17,700 కోట్లు కేటాయించుకున్నం. రెండవ విడత లక్షా 30 వేల మందికి దళిత బంధు పథకం అందించుకుంటున్నం.
హుజూరాబాద్ నియోజకవర్గంలో నూటికి నూరు శాతం దళితబంధు పథకాన్ని అమలు పరిచాం. మిగిలిన 118 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 1100 మందికి ప్రస్తుతం అందిస్తున్నాం. దళితులు పారిశ్రామిక, వ్యాపార రంగాలలో మరింత ముందుకువచ్చి ప్రగతి సాధించాలన్నది నా ఆకాంక్ష. ఇందుకు అనుగుణంగా లాభసాటి వ్యాపారాలకు ప్రభుత్వం ఇచ్చే లైసెన్సులలో దళితులకు 15 శాతం రిజర్వేషన్లు కూడా అమలు చేస్తున్నది. ఫర్టిలైజర్ షాపుల కేటాయింపులో, హాస్పిటల్ హాస్టల్ కాంట్రాక్టుల కేటాయింపుల్లో, మెడికల్ షాపుల కేటాయింపుల్లో రిజర్వేషన్ అమలవుతున్నది. ఇటీవల రాష్ట్రంలో కేటాయించిన 2,616 వైన్ షాపుల్లో 261 షాపులు దళితులకు కేటాయించింది. దళిత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ కింద 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నది. దళితుల గృహావసరాలకోసం 101 యూనిట్ల వరకూ విద్యుత్ ను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోంది. షెడ్యూలు కులాలు, తెగల అభివృద్ధికి ప్రత్యేక ప్రగతినిధి చట్టాన్ని రాష్ట్రప్రభుత్వం అమలుపరుస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు ఉద్దేశించిన నిధులు ఇతర పథకాలకు మళ్లించకుండా రక్షణ కల్పించింది. ఏదైనా ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులు పూర్తిగా ఖర్చుగాని పక్షంలో ఈ చట్టంప్రకారం ఆ నిధులను తరువాతి సంవత్సరానికి కచ్చితంగా బదలాయింపు చేసేలా నిబంధనలు తీసుకొచ్చింది.