నవతెలంగాణ – ఢీల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆప్ నేత, ఢీల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాకు ఢీల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ నమోదు చేసిన కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు ఢీల్లీ హైకోర్టు న్యాయమూర్తి దినేశ్ కుమార్ శర్మ మంగళవారం ఉదయం తీర్పు వెలువరించారు. సిసోదియాపై ఉన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. ఆయన బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని తెలిపింది. అందువల్ల ఆయనకు బెయిల్ ఇవ్వలేమని న్యాయస్థానం వెల్లడించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో బెయిల్ కోసం సిసోదియా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పన, అమలులో అవకతవకలు చోటుచేసుకున్న వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు సిసోదియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.