– రేపు ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు: మంత్రి తలసాని
– హౌంమంత్రితో కలిసి ఏర్పాట్ల పరిశీలన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డప్పు చప్పుళ్లు… బైక్ ర్యాలీలతో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని ట్యాంక్బండ్ వద్ద గల 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద హౌంమంత్రి మహమూద్ అలీ, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, డీజీపీ అంజనీ కుమార్, ఆర్ అండ్ బీ కార్యదర్శి శ్రీనివాసరాజులతో కలిసి తలసాని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించి 10వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్బంగా నగరంలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో బైక్లపై ర్యాలీగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకోవాలని సూచించారు.
అనంతరం వేలాదిమంది కళాకారుల నృత్యాలు, డప్పు చప్పుళ్ళు, వివిధ వేషధారణలతో ర్యాలీగా వేలాదిమంది ప్రజలతో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా నిర్మించిన అమరవీరుల స్మారక కేంద్రం వద్దకు చేరుకోవాలని కోరారు. అనంతరం సీఎం కేసీఆర్…. స్మారక కేంద్రాన్ని ప్రారంభించి అక్కడే ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారని తెలిపారు. తదనంతరం గడిచిన తొమ్మిదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించే విధంగా 750 డ్రోన్ లతో భారీ షో ఉంటుందని చెప్పారు.
ప్రజలు డ్రోన్ షోను వీక్షించే విధంగా ట్యాంక్ బండ్పై అదే రోజు సాయంత్రం రాకపోకలు నిలిపేస్తామని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అమరు కుమార్, సమాచార శాఖ కమిషనర్ అశోక్ రెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ, పలువురు డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు.