– మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ పాలించిన 60 ఏండ్లలో ఆ పార్టీ నేతలు ఎదిగారే తప్ప ప్రజలకు చేసిందేమి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బిల్యా నాయక్ తన అనుచరులతో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఫేక్ సర్వేలతో పిచ్చి ప్రయత్నాలు చేసి చిత్తుగా ఓడిపోవడం కాంగ్రెస్కు కొత్తేమి కాదని ఎద్దేవా చేశారు. ఏమి చేయని కాంగ్రెస్కు
ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు, వ్యవసాయ సంక్షోభం, రైతు ఆత్మహత్యలు, తాగునీటి కొరతతో దుర్భర పరిస్థితులేననీ, అలాంటి పరిస్థితి కావాలా అని అడిగారు. 33 నియోజకవర్గాల్లో తిరిగినా తనకు ఎక్కడా ప్రభుత్వ వ్యతిరేకత కనిపించలేదని తెలిపారు. గిరిజనులకు ఆరు నుంచి 10 శాతానికి రిజర్వేషన్ పెంపు, తండాలను గ్రామ పంచాయతీలను చేసి స్వపరిపాలనా అధికారం కల్పించామని గుర్తుచేశారు. దేవరకొండ ప్రస్తుత ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, బిల్యానాయక్ కలిసిన తర్వాత అక్కడ ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.