![పోస్టల్ బ్యాలెట్ అవకాశం](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/10/ecr.jpg)
నవతెలంగాణ జైపుర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో జర్నలిస్టుల తోపాటు ఎనిమిది శాఖల్లో ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించనున్నట్టు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 25న జరిగే పోలింగ్కు జర్నలిస్టులతో పాటు విద్యుత్తు, రవాణా, ఆరోగ్యశాఖలు సహా మొత్తం 8 శాఖల్లో ఉద్యోగులకు పోస్టల్బ్యాలెట్ సదుపాయం కల్పిస్తున్నట్టు రాజస్థాన్ సీఈఓ ప్రవీణ్ గుప్తా తెలిపారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, అంబులెన్స్ వర్కర్లు, ఇంధన శాఖలో ఎలక్ట్రీషియన్లు, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగంలో లైన్మెన్లు, పంప్ ఆపరేటర్లు, రాజస్థాన్ మిల్క్ కమిటీల్లో టర్నర్లు, రవాణా కార్పొరేషన్లో ఉద్యోగులు, డ్రైవర్లు, కండక్టర్లు, అగ్నిమాపక సిబ్బందితో పాటు మీడియా సిబ్బందికి ఈ ఏడాది నుంచి పోస్టల్బ్యాలెట్ అవకాశం కల్పించినట్టు వారు తెలిపారు.
మీడియా సిబ్బందిని సర్వీసు ఓటర్ల కేటగిరీలో చేర్చడం ఇదే తొలిసారి అన్నారు. ఇప్పటివరకు ఈ సదుపాయం ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, అధికారులకు, ఆర్మీ, పారా మిలటరీ సిబ్బందికి మాత్రమే ఉందని వివరించారు. అయితే, పోలింగ్ రోజున విధుల్లో ఉండే ఉద్యోగుల గురించి, ఆరోజు ఓటు వేయడం సాధ్యంకానివారి వివరాలను సంబంధిత విభాగాలు తమకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని సీఈఓ తెలిపారు. ఆ జాబితాల ఆధారంగా రిటర్నింగ్ అధికారి ఆ ఉద్యోగులకు ఫారం 12-డి జారీ చేసి వారికి ఫెసిలిటేషన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే వెసులుబాటు కల్పిస్తారని తెలిపారు.