నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-2 (TSPSC Group 2) పరీక్ష మరోసారి వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నవంబరు 2, 3 తేదీల్లో జరగాల్సి ఉండగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్షను రీషెడ్యూల్ చేశారు. TSPSC Group 2 పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.51లక్షల మంది అభ్యర్థులు 783 గ్రూప్-2 పోస్టులకు పోటీ పడుతున్నారు. తొలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే, అప్పుడు వరుసగా ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో గ్రూప్ -2 పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలతో ప్రభుత్వం గ్రూప్-2 పరీక్షను వాయిదా వేసింది. ఈ విధంగా వాయిదా పడటం ఇది రెండోసారి. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో గ్రూప్-2 పరీక్ష వాయిదా, కొత్త తేదీల ఖరారుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు.