నవతెలంగాణ -హైదరాబాద్: కొన్ని మీడియా సంస్థలు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్లో కొంతమంది నేతల పేర్లను చెబుతూ గందరగోళం చేస్తున్నాయని.. ఆ పేర్లు నిజం కావని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తప్పుడు వార్తలు వేస్తున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టాలి. పార్టీలకు బాకా ఉదుతున్న వార్తలను పెయిడ్ వార్తలుగా పరిగణించాలి. పీఏసీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం. రాహుల్, ఖర్గే, ప్రియాంక కావల్సినంత సమయం ఇస్తా అన్నారు. అభ్యర్థులను ప్రకటించి బస్సు యాత్ర చేయాలా? బస్సు యాత్ర చేసి అభ్యర్థులను ప్రకటించాలా అని ఆలోచిస్తున్నాం. ఒక ప్రాసెస్ ప్రకారం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పలు రాజకీయ పార్టీలతో పొత్తులపై చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి. పార్టీకి సేవ చేసిన వారికి సముచిత గౌరవం ఇస్తాం. అసెంబ్లీ అభ్యర్థులను మాత్రమే ప్రకటిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఇంకా అనేక పదవులు, అవకాశాలు ఉంటాయి. జానారెడ్డి, థాక్రే, మున్షీ, మీనాక్షి నటరాజన్ అధ్వర్యంలో ఒక కమిటీ వేస్తున్నాం. పార్టీ కోసం పనిచేసిన వారి విషయంలో నిర్ణయాలు, సూచనలు ఇవ్వడానికి ఈ కమిటీ పని చేస్తుంది. రాష్ట్రంలో కొందరు అధికారులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువగా ఆ పార్టీ కోసం పని చేస్తున్నారు. రాష్ట్ర డీజీపీ ఏపీ క్యాడర్ ఆఫీసర్. స్టీఫెన్ రవీంద్ర, ప్రభాకర్రావు లాంటి అధికారులు ఒకే పదవిలో పలు సంవత్సరాలుగా ఉన్నారు. కొందరు సీఐలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అధికారులు ఆర్థిక నియంత్రణ పాటించాలి. బీఆర్ఎస్ పార్టీకి ప్రయోజనం చేకూరే విధంగా పనిచేస్తున్న అధికారులను వదిలిపెట్టం. ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డి అధికారులకు సంబంధించిన పలు కీలక అంశాలను పీఏసీలో చర్చించారు. ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారుల నియంత్రణ కోసం ఒక కమిటీ నియమించాం. కేసీఆర్ దొరికినోనికల్లా పదవి ఇస్తున్నాడు. అవి చెల్లవు. గత ఆరు నెలల నుంచి కేసీఆర్ బీఆర్ఎస్ నేతలకు ఇచ్చిన పదవులను రద్దు చేయాలి. కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు. గత ఆరు నెలల నుంచి జరిగిన టెండర్లు, నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సమీక్షిస్తుంది. ఎన్నికల హోర్డింగులు తదితర చోట్ల ప్రతిపక్షాలకు స్థానం లేకుండా చేస్తున్నారు. మెట్రో హోర్డింగుల్లో కూడా అన్ని పార్టీలకు సమ ప్రాధాన్యత ఇవ్వాలి. డిసెంబర్ 3వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది’’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.