నవతెలంగాణ-బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా సీనియర్ నేత సిద్ధరామయ్య శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ వీరి చేత ప్రమాణం చేయించారు. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మరో ఎనిమిది మంది క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మాజీ ఉపముఖ్యమంత్రి జి.పరమేశ్వర, కె.హెచ్ మునియప్ప, కె.జె. జార్జ్, ఎం.బి. పాటిల్, సతీశ్ జర్ఖిహోళి, ప్రియాంక్ ఖర్గే, రామలింగారెడ్డి, బి.జడ్. జమీర్ అహ్మద్ ఖాన్ చేత గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కుమారుడు ప్రియాంక్కు కేబినెట్లో చోటు దక్కింది. ఇక అన్ని వర్గాల వారికీ సమప్రాధాన్యం కల్పించేలా క్యాబినెట్లో మంత్రి పదవులను కేటాయించినట్లు కాంగ్రెస్ తెలిపింది.