నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
మండలంలోని గోపాలగిరి గ్రామంలో తాటిచెట్టు పై నుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలైన సంఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గోపాలగిరి గ్రామానికి చెందిన కల్లు గీతకార్మికుడు ఎనమాల వెంకటపతి రోజు మాదిరిగానే ఉదయం తన వృత్తిలో భాగంగా తాటిచెట్టు పైకి ఎక్కి కల్లు గీస్తుండగా ఒక్కసారిగా ప్రమాదవశాత్తు జారీ కింద పడిపోయాడు. ఆ కార్మికుడికి నడుము విరుగగా, కాలు, చేతులు విరిగినట్లు తెలిపారు. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో ఖమ్మం లోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండి ఆదుకోవాలని స్థానిక కల్లుగీత కార్మికులు కోరుతున్నారు.