నవతెలంగాణ – అహ్మదాబాద్ : సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను గుజరాత్ హైకోర్టు శనివారం తిరస్కరించింది. ఆపై 2002 గ్రోదా అనంతరం జరిగిన అల్లర్ల కేసుల్లో అమాయకులను ఇరికించేందుకు సాక్ష్యాధారాలను కల్పించారనే ఆరోపణకు సంబంధించిన కేసులో సెతల్వాద్ తక్షణమే లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. గుజరాత్ అల్లర్ల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ఆమెను గుజరాత్ ఉగ్రవాద నిరోధక బృందం (ఏటిఎస్) గతేడాది జూన్ 25వ తేదన అరెస్టు చేసింది. ఆమెతోపాటు మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్బి శ్రీకుమార్ని కూడా గుజరాత్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసు రిమాండ్ ముగిసిన తర్వాత కోర్టు జులై 2వ తేదీ వారిని జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. ఈ కేసులో సుప్రీంకోర్టు తీస్తా సెతల్వాద్కి సెప్టెంబర్లో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై జైలు బయట ఉన్న ఆమె తక్షణమే లొంగిపోవాలని గుజరాత్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, 2002 గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక బృందం ఇచ్చిన క్లీన్ చిట్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిన మరుసటి రోజే (గతేడాది సెప్టెంబర్ 21) సెతల్వాద్, శ్రీకుమార్తోపాటు, జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఐపిఎస్ అధికారి సంజీవ్ భట్లపై గోద్రా అనంతర అల్లర్ల కేసుల్లో అమాయకులను ఇరికిచేందుకు సాక్ష్యాధారాలను కల్పించారనే ఆరోపణలపై అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీరిపై భారత శిక్షాస్మృతి ప్రకారం 468, 471 (ఫోర్జరీ), 211 (మరణశిక్ష నేరాన్ని నిర్ధారించే ఉద్దేశంతో తప్పుడు సాక్ష్యాలను ఇవ్వడం లేదా కల్పించడం), 218 (వ్యక్తిని శిక్ష నుండి లేదా ఆస్తి జప్తు నుండి రక్షించాలనే ఉద్దేశంతో ప్రజాసేవకుడు తప్పుడు రికార్డును రూపొందించడం), నేరపూరిత కుట్ర 120 (బి) సెక్షన్ల కింద అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.