![సుప్రీంకోర్టు నోటిసులు](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/08/haryana-2.jpg)
న్యూఢిల్లీ : హర్యానాలో నుహ్ జిల్లాలో సోమవారం మొదలైన మత ఘర్షణలు ఇతర రాష్ట్రాలకు పాకాయి. విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ), భజరంగ్ దళ్ గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ హింసాకాండకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలకు సుప్రీంకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. హర్యానా హింసాకాండపై దాఖలపైన పిటిషన్ను సంజీవ్ ఖన్నా, ఎస్.వి.ఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారించింది. తదుపరి విచారణను ఆగస్టు 4కి వాయిదా వేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగానే.. పలు రాష్ట్రాల్లో జరుగుతున్న నిరసనలకు వ్యతిరేకంగా సుప్రీం నోటీసులు జారీ చేసింది. ‘విద్వేష ప్రసంగాలు ఉండకూడదు. హింసకు పాల్పకూడదు. అదనపు బలగాలు మోహరించాలి. సీసీటివీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. రికార్డ్ చేయబడిన ప్రతిదాన్ని భద్రపరచాలి’ అని ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం పేర్కొంది. ఇదిలా ఉండగా వీహెచ్పీ కార్యకర్తలు, భజరంగ్దళ్ కార్యకర్తలు దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో బుధవారం నిరసనలు చేశారు. తూర్పు ఢిల్లీలోని నిర్మాణ్ విహార్ మెట్రో స్టేషన్, ఘోండా చౌక్ సమీపంలోని వీధుల్లోకి వచ్చి నినాదాలు చేయడంతో… ఆ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు మోహరించారు.