నవతెలంగాణ – ఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు శుక్రవారం వాడీవేడిగా కొనసాగాయి. ఈ కేసులో సెక్షన్ 17ఏ వర్తిస్తుందని చంద్రబాబు తరఫు న్యాయవాది వాదించగా.. ఆ సెక్షన్ వర్తించదని సీఐడీ తరఫు న్యాయవాది వాదించారు. ఇరువైపులా సుదీర్ఘ వాదనలు విన్న జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 17 (మంగళవారం) మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేసింది. చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ స్కిల్ కేసు విచారణకు ఫైబర్నెట్ కేసుతో సంబంధం ఉందన్నారు. మరో కేసులో చంద్రబాబును 16న ప్రవేశపెట్టేందుకు వారెంట్ తీసుకున్నారని కోర్టు దఅష్టికి తెచ్చారు. కేసులపై కేసులు పెట్టి తమను సర్కస్ ఆడిస్తున్నారని వెల్లడించారు. ఇక్కడ కూడా 17ఏను ఛాలెంజ్ చేస్తున్నారా? అని లూథ్రాను జస్టిస్ త్రివేది ప్రశ్నించగా.. అవును 17ఏ ప్రతిచోటా వర్తిస్తుందని లూథ్రా తెలిపారు.సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. చట్టాన్ని రద్దు చేసినా, వెనక్కి తీసుకున్నప్పటికీ నేరం జరిగినప్పుడు ఉన్న చట్టమే వర్తిస్తుందన్నారు. కొత్త చట్టం అమలులోకి రాకముందే నేరం జరిగింది కాబట్టి సవరణ చట్టం ఈ కేసుకు వర్తించదన్నారు. ”అసలు ఎంక్వయిరీ విషయంలోనే నిరోధం ఉన్నప్పుడు కేసులు ఎలా ఫైల్ చేస్తారు? ఎంక్వయిరీ లేదా ఎంక్వరీ మీద నిరోధం ఉన్నప్పుడు పోలీసు అధికారి కేసు పెట్టాలని ఎలా నిర్ణయిస్తారు? పోలీసు అధికారికి కేసు నమోదు చేసే అధికారం లేనప్పుడు ఎలా కేసు నమోదు చేస్తారు?” అని జస్టిస్ బోస్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా సీఐడీ తరఫు న్యాయవాది రోహత్గీ స్పందిస్తూ.. ఎఫ్ఐఆర్ రద్దు చేయాలన్న అంశంపై ఎంసీ గుప్తా కేసును ప్రస్తావించారు. చట్టం అమలులో ఉన్నప్పుడు జరిగిన నేరాలకు అదే చట్టం వర్తిస్తుందని వాదించారు.